ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 17, 2026, 06:21 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఏపీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అమరావతిలో పలు ఐకానిక్ కట్టడాలు ఉండేలా చర్యలు చేపడుతోంది. అలాగే అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపడుతోంది. వీటితో పాటుగా.. అమరావతిలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ వంటి ప్రముఖుల విగ్రహాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతిలో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహావిష్కరణ ముహూర్తం ఖరారైంది. మార్చి 16వ తేదీన అమరావతిలో పొట్టి్శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాజేష్ వెల్లడించారు.


రాష్ట్రం కోసం అమరజీవి పొట్టిశ్రీరాములు చేసిన 58 రోజుల దీక్షకు గుర్తుగా.. రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డూండి రాజేష్ తెలిపారు. మార్చి 16న ఈ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ పేరును.. వాసవీ పెనుగొండగా మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు అమరావతిలో ఏర్పాటుచేసే పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్‌ శాక్రిఫైస్‌ అనే పేరు పెట్టారు.


 అమరావతి రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో పొట్టిశ్రీరాములు విగ్రహం, స్కృతి వనం ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి కావటంతో.. అదే రోజున ఈ స్మృతివనంలో ఏర్పాటుచేసిన పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహావిష్కరణ అనంతరం పొట్టి శ్రీరాములు 125 జయంతి ఉత్సవాలను మార్చి 16 నుంచి ఏడాది పొడవునా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.


మరోవైపు పొట్టి శ్రీరాములు విగ్రహం ప్రాజెక్టును పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. పొట్టి శ్రీరాములు విగ్రహాంతో పాటుగా అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివిధ పార్టీల నుంచి రాజకీయ విమర్శలు వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa