ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ ‘గాజా శాంతి బోర్డు’.. సభ్యత్వ రుసుం రూ.9 వేల కోట్లు!

international |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 08:52 PM

హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పల విరమణ నేపథ్యంలో గాజాలో సాధారణ పరిస్థితులు నెలకుంటున్నాయి. ఈ క్రమంలో గాజాలో శాంతి కోసం కీలక అడుగుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి బోర్డులో సభ్యులుగా ఉండాలంటే.. ఆ దేశాలు ఏటా 1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.9087 కోట్లు) చెల్లించాల్సి ఉంటుందని బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ నివేదించింది. ఈ బోర్డు ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయమని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, గాజా శాంతి బోర్డుకు తొలి ఛైర్మన్‌గా ట్రంప్ వ్యవహరిస్తారు. సభ్య దేశాలకు మూడేళ్ల పదవీకాలం ఉంటుంది. అయితే, పదవీకాలం పొడిగించాలంటే ఛైర్మన్ అనుమతి తప్పనిసరి. సభ్యుల ఎంపిక కూడా ట్రంప్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.


 ఈ ప్రతిపాదన ప్రకారం.. పీస్ బోర్డులో చేరిన దేశాలు శాంతి, భద్రత, శ్రేయస్సు కోసం తమ నిబద్ధతను చాటుకోవాలి. ‘ఈ చార్టర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి సభ్య దేశానికి పదవీకాలం గరిష్టంగా మూడేళ్లు ఉంటుంది.. ఆ తర్వాత సభ్యత్వ పునరుద్ధరణ చైర్మన్ నిర్ణయానికి లోబడి ఉంటుంది. చార్టర్ అమల్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలో బోర్డ్ ఆఫ్ పీస్‌కు 1,000,000,000 డాలర్లకు పైగా నిధులను అందించే సభ్య దేశాలకు మూడేళ్ల కాలపరిమితి నిబంధన వర్తించదు’’ అని డ్రాఫ్ట్ పేర్కొంది.


కానీ, ఈ నివేదికపై స్పందించిన వైట్‌హౌస్.. పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. బోర్డులో చేరడానికి కనీస సభ్యత్వ రుసుం ఏదీ లేదని స్పష్టం చేసింది. ‘ఇది కేవలం శాంతి, భద్రత, శ్రేయస్సు పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శించే భాగస్వామ్య దేశాలకు శాశ్వత సభ్యత్వాన్ని అందిస్తుంది’ అని వైట్‌హౌస్ ఎక్స్ ( ట్విట్టర్)లో తెలిపింది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ శాఖ సైతం గతంలో ట్రంప్, స్టీవ్ విట్కాఫ్ చేసిన సోషల్ మీడియా పోస్టులను ప్రస్తావించింది. వాటిలో ఒక బిలియన్ డాలర్ల ప్రస్తావన లేదని పేర్కొంది.


‘సంఘర్షణల వల్ల ప్రభావితమైన లేదా బెదిరింపులకు గురైన ప్రాంతాలలో స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించడం, శాశ్వత శాంతిని భద్రపరచడానికి ప్రయత్నించే అంతర్జాతీయ సంస్థ’గా డ్రాఫ్ట్ అభివర్ణించింది. మూడు సభ్య దేశాలు చార్టర్‌కు అంగీకరిస్తే ఇది అధికారికం అవుతుంది. అయితే, ట్రంప్ తరుచూ ఐక్యరాజ్యసమితిపై విమర్శలు చేస్తున్నందున ఆయన ఈ బోర్డును ఐరాసకు ప్రత్యామ్నాయంగా తెరపైకి తీసుకొచ్చారని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ బోర్డులో భారత సంతతికి చెందిన, పద్మశ్రీ అవార్డు గ్రహీత అజయ్ బంగా వంటి వారు కూడా ఉండటం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa