విద్యార్థులకు విజయవాడ దుర్గ గుడి దేవస్థానం శుభవార్త వినిపించింది. జనవరి 23వ తేదీన విద్యార్థులకు ఉచితంగా దుర్గమ్మ దర్శనం కల్పించనుంది. జనవరి 23వ తేదీ మాఘ శుద్ధ పంచమి కావటంతో విజయవాడ దుర్గ గుడిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రమైన మాఘ శుద్ధ పంచమి రోజున కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకు సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్టుకు ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. అలాగే మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 500 మంది చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగనుంది.
మాఘ శుద్ధ పంచమి కావటంతో జనవరి 23వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడింటి వరకూ దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఉచితంగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించాలని దుర్గ గుడి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ ధరించి, ఐడెంటిటీ కార్డుతో ఆలయానికి వచ్చే విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. దర్శనం పూర్తి అయిన తర్వాత విద్యార్థులకు శక్తి కంకణం, అమ్మవారి ఫోటోతో పాటు.. ఓ పెన్ను, 40 గ్రాముల లడ్డూను ఆలయ అధికారులు ఉచితంగా అందించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో దుర్గ గుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు మాఘ శుద్ధ పంచమి కావటంతో ఆలయాలకు భక్తుల తాకిడి పెరగనుంది. అలాగే అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఇక నిర్మల్ జిల్లాలోని బాసర, సిద్ధిపేట జిల్లాలోని వర్గల్ ఆలయాలకు సైతం భక్తుల తాకిడి పెరగనుంది. మాఘ శుద్ధ పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే మంచిదని పెద్దలు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆరోజు సరస్వతీదేవి ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ఆలయాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa