ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరుద్యోగులకు .. ట్రైనింగ్, ఫుడ్, వసతి ఉచితం.. ఉద్యోగం కూడా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 09:37 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్‌ యోజన (డీడీయూజీకేవై) కింద ఏపీ సీడాప్‌ సంస్థ ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. కర్నూలు జిల్లాలో డీడీయూజీకేవై 2.0 ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ అవసరాలకు తగిన విధంగా శిక్షణతో పాటు స్పోకెన్‌ ఇంగ్లిష్, కంప్యూటర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం..


ఉచిత వసతి కూడా కల్పిస్తారు. ప్రతి కోర్సు కనీసం 90 రోజుల పాటు ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ శిక్షణ కోసం ఒక్కో విద్యార్థిపై రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేస్తున్నాయి. ఈ శిక్షణతో యువతకు మంచి నైపుణ్యాలతో పాటుగా ఉపాధి కూడా పొందొచ్చు.స్పోకెన్‌ ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం, సాఫ్ట్ స్కిల్స్ వంటివి నేర్పిస్తారు.. సీడాప్‌ సంస్థ ఈ శిక్షణను పర్యవేక్షిస్తుంది.


18 నుంచి 35 ఏళ్ల యువతకు ఉచిత శిక్షణ ఇస్తారు.. అలాగే ఉద్యోగాలు కూడా కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళల పిల్లలు, ఉపాధిహామీ జాబ్‌కార్డు ఉన్న కుటుంబాల పిల్లలు ఈ శిక్షణకు అర్హులు. వివిధ రంగాల్లో పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్‌ చదివిన వారికి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక పరీక్షలు పెట్టి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఏజెన్సీలదే.. హైదరాబాద్, బెంగళూరులోని కంపెనీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి.


నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ సూచించారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంబంధిత కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం సీడాప్‌ జాబ్స్‌ మేనేజర్‌ అశోక్‌ను 87124 95518 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఈ శిక్షణ ద్వారా యువతకు మంచి భవిష్యత్తు లభిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.


8వ తరగతి చదివిన వారికి ఆటోమోటివ్‌ అసెంబుల్‌ అసిస్టెంట్‌, హార్డ్‌వేర్‌ అసెంబుల్‌ ఆపరేటర్‌గా శిక్షణ అందిస్తారు. ఇంటర్, పాలిటెక్నిక్‌ చదివిన వారికి రూఫ్‌ టాప్‌ సోలార్‌ గ్రిడ్‌ జూనియర్‌ ఇంజినీర్‌ కోర్సు.. పదో తరగతి పాసైన వారికి కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌గా, హోమ్‌ హెల్త్‌ ఎయిడ్‌గా, టెలికాం రంగంలో బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నీషియన్‌గా శిక్షణ అందిస్తారు. జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, సోలార్‌ పీవీ ఇన్‌స్టాలర్‌గా, సోలార్‌ ప్యానెల్‌ ఇన్‌స్టలేషన్‌ టెక్నీషియన్‌గా శిక్షణ ఇస్తారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు రంగాల్లో శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నారు. మొత్తం 505 మంది యువతకు రిటైల్, టెలికాం, హెల్త్‌కేర్, సోలార్ టెక్నీషియన్ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగాలు సులభంగా లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ శిక్షణా కార్యక్రమాలు యువతకు నైపుణ్యాలను పెంచి, ఉపాధి మార్గాలను సుగమం చేస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa