ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్య, బంధువులపై కాల్పులు.. అమెరికాలో భారతీయుడి దారుణం

international |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 09:14 PM

అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఒక భారతీయ వ్యక్తి తన భార్యతో పాటు మరో ముగ్గురు బంధువులను కాల్చి చంపాడు. ఇంట్లో కాల్పులు జరుగుతుండటంతో.. నిందితుడి 12 ఏళ్ల కుమార్తెతో పాటు మరో ముగ్గురు పిల్లలు ఒక అల్మారాలో దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని విజయ్ కుమార్ (51)గా గుర్తించారు. ఈ విషయం గురించి అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది. మృతుల కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.


"కుటుంబ కలహాల కారణంగా జరిగిన ఈ దారుణమైన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోవడం చాలా బాధాకరం. నిందితుడైన వ్యక్తిని అరెస్ట్ చేశారు. మృతుల కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నాం" అని రాయబార కార్యాలయం పేర్కొంది.


ఈ దారుణం గురించి పోలీసులకు శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు సమాచారం అందింది. బ్రూక్ ఐవీ కోర్ట్‌లోని 1000 బ్లాక్‌లో కాల్పులు జరిగినట్లు వారికి తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు, ఇంట్లో నలుగురు వ్యక్తుల మృతదేహాలను గుర్తించారు. వారందరికీ బుల్లెట్ గాయాలు అయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు తమ K-9 (పోలీసు శునకాలు) బృందాలను చుట్టుపక్కల ప్రాంతాల్లోకి పంపించారు. ఒక పోలీస్ శునకం విజయ్ కుమార్‌ను సమీపంలోని అడవిలో గుర్తించడంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు.


గ్వినెట్ కౌంటీ పోలీసులు మృతుల వివరాలను వెల్లడించారు. మృతుల్లో విజయ్ కుమార్ భార్య మీము డోగ్రా (43)తో పాటు గౌరవ్ కుమార్ (33), నిధి చందర్ (37), హరీష్ చందర్ (38) ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురు మీము డోగ్రా బంధువులని పోలీసులు వెల్లడించారు. వీరంతా లారెన్స్‌విల్లేకు చెందినవారని తెలిపారు.


ఈ కాల్పుల గురించి విజయ్ కుమార్, డోగ్రా దంపతుల కుమార్తెనే 911కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిందని, దానివల్ల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగలిగారని తెలిపారు. అదృష్టవశాత్తూ పిల్లలు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, వారిని ప్రస్తుతం ఒక కుటుంబ సభ్యుడు తీసుకెళ్లారని తెలిసింది.


దారుణానికి కారణం విజయ్ కుమార్, డోగ్రా మధ్య మొదలైన గొడవ పెద్దదిగా మారింది. ఆ తర్వాత వారు తమ బిడ్డతో కలిసి బ్రూక్ ఐవీ కోర్ట్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్ తో పాటు ఏడు, పదేళ్ల వయసున్న ఇద్దరు మైనర్లు కూడా నివసిస్తున్నారు. బంధువుల ఇంటికి వెళ్లిన తర్వాత భార్యాభర్తల మధ్య వివాదం ముదరడంతో విచక్షణ కోల్పోయిన విజయ్ కుమార్.. తన భార్య డోగ్రాతో పాటు మరో ముగ్గురిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


విజయ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని దోషిగా తేల్చితే కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఘటన అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు ఇంతటి దారుణానికి దారితీయడం విచారకరం అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa