ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదాయం ఇంత ఉంటే పైసా పన్ను కట్టక్కర్లేదు

business |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 10:32 PM

2026 బడ్జెట్‌కు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద లభించే ఆదాయపు పన్ను రిబేటుపై ఈసారి కూడా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కొత్త ఆదాయపు పన్ను విధానం కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లేదా 2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి టాక్స్ రిబేట్ రూ. 60 వేలుగా ఉంది. అంటే.. ఇక్కడ రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి టాక్స్ రిబేట్ కింద పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ పరిమితిని మరింత పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. లేదా నిబంధనల్ని మరింత సులభతరం చేయాలని నిపుణులు కోరుతున్నారు. అసలు టాక్స్ రిబేట్ అంటే ఏంటి.. పాత లేదా కొత్త పన్ను విధానాల్లో ఇదెలా పనిచేస్తుంది. ఎవరెవరు అర్హులు.. ఇలా పూర్తి వివరాల్ని చూద్దాం.


>> ఇక్కడ టాక్స్ రిబేట్ అనేది ప్రభుత్వం.. పన్ను చెల్లింపుదారులకు ఇచ్చే రాయితీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ రాయితీని.. చెల్లించాల్సిన మొత్తం పన్ను నుంచి తగ్గించుకోవచ్చు. ఇన్‌కంటాక్స్ యాక్ట్ సెక్షన్ 87A కింద ఈ రిబేటు లభిస్తుంది. ఇక్కడ ఆదాయం ఒక పరిమితి లోపు ఉంటే.. పైసా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలో నివసించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. NRI లు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF), కంపెనీలకు ఈ రిబేటు వర్తించదు. ఇంకా క్యాపిటల్ గెయిన్స్ వంటి ప్రత్యేక రేట్లు వర్తించే ఆదాయంపై ఈ రిబేటు వర్తించదు. ఇప్పుడు పాత లేదా కొత్త పన్ను విధానాల్లో ఈ టాక్స్ రిబేట్ ఎంత ఉందో చూద్దాం.


పాత పన్ను విధానంలో సెక్షన్ 87A కింద టాక్స్ రిబేట్ రూ. 12,500 గా ఉంది. దీని ప్రకారం.. రూ. 5 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ పడదన్నమాట. ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగా ఉంది కాబట్టి వేతనజీవులు పాత పన్ను విధానం కింద రూ. 5.50 లక్షల వరకు టాక్స్ చెల్లించాల్సిన పని ఉండదు. ఇక్కడ టాక్స్ రిబేట్ ఇలా వర్తిస్తుందన్నమాట. ఆపైన ఆదాయం ఉంటే మాత్రం.. టాక్స్ శ్లాబుల్ని బట్టి చెల్లించాల్సి వస్తుంది.


కొత్త పన్ను విధానంలో చూస్తే.. ఇప్పటివరకు టాక్స్ రిబేటు రూ. 25 వేల వరకు వర్తించేది. ఇక్కడ ఈ టాక్స్ రిబేట్ ప్రకారం.. రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలుగా ఉండగా.. ఇక్కడ రూ. 7.75 లక్షల వరకు ఆదాయంపై పన్ను వర్తించదు. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఇది వర్తించగా.. 2025 బడ్జెట్‌లో కీలక మార్పులు చేశారు.


దీని ప్రకారం ఇప్పుడు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై 2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌లో టాక్స్ రిబేట్ రూ. 60 వేలుగా ఉంది. దీని ప్రకారం.. కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు టాక్స్ పడదు. వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ రూ. 75 వేలతో కలిపి రూ. 12.75 లక్షల వరకు టాక్స్ ఉండదు. అంటే సాధారణంగా రూ. 12 లక్షల ఆదాయంపై టాక్స్ శ్లాబుల ఆధారంగా చూస్తే చెల్లించాల్సిన పన్ను రూ. 60 వేలుగా ఉంటుంది. ఇక్కడ టాక్స్ రిబేటు రూ. 60 వేలు వర్తిస్తుంది కాబట్టి పైసా పన్ను పడదన్నమాట. ఇంకా రూ. 12 లక్షల కంటే ఆదాయం కొంచెం ఎక్కువగా ఉన్న వారికి కూడా దాని వల్ల పన్ను భారం అధికంగా పడకుండా ఉండేందుకు మార్జినల్ రిలీఫ్ అనే సౌకర్యం కూడా పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంది.


ఇప్పుడు 2026 బడ్జెట్‌లో టాక్స్ రిబేట్ పరిమితిని మరింత పెంచాలని కోరుతున్నారు. దీని వల్ల రూ. 12.75 లక్షలు దాటిన ఆదాయంపైనా పన్ను గణనీయంగా తగ్గించుకునే వీలు పడుతుంది. ఇప్పుడు రూ. 12 లక్షలు దాటితే ఒక్కసారిగా చెల్లించాల్సిన పన్ను భారీగా ఉంటుంది. కానీ ఇక్కడ కూడా కాస్త పన్ను భారం తగ్గేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు. ఇంకా బంగారం లేదా షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటివి అమ్మినప్పుడు వర్తించే క్యాపిటల్ గెయిన్స్ వంటి ఆదాయాలకు కూడా ఈ రిబేట్ వర్తింపజేయాలని కోరుతున్నారు. మరి కేంద్రం దీనిపై ఏమైనా శుభవార్త చెబుతుందో లేదో అనేది ఫిబ్రవరి 1న తేలనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa