అగ్రరాజ్యం అమెరికాతో భారత్ జరిపిన మధ్యంతర వాణిజ్య చర్చలు ఫలించి.. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ భారీ ఒప్పందానికి సంబంధించిన కీలక వివరాలను కేంద్ర ప్రభుత్వం శనివారం రోజు అధికారికంగా వెల్లడించింది. ఈక్రమంలోనే అమెరికా మద్యంపై సున్నా సుంకాలు విధించిన భారత్.. యూఎస్ గోధుమలకు మాత్రం ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. అయితే భారత్ ఇలా చేయడానికి ఓ పెద్ద కారణమే ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడటమేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వివరించారు. అందుకే అమెరికా నుంచి దిగుమతి అయ్యే గోధుమలు, బియ్యం, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలపై భారత్ ఎలాంటి సుంకాల రాయితీలు ఇవ్వలేదని చెప్పారు. అలాగే పాలు, చీజ్ వంటి పాడి ఉత్పత్తులతో పాటు పౌల్ట్రీ, మాంసం, కూరగాయలు, పొగాకు వంటి సున్నితమైన రంగాలను ఈ ఒప్పందం నుంచి పూర్తిగా మినహాయించినట్లు వెల్లడించారు. "ఏయే రంగాల్లో భారతదేశం స్వయంసమృద్ధి సాధించిందో, ఆ ఉత్పత్తులు అన్నింటినీ ఈ ఒప్పందం పరిధి నుంచి బయట ఉంచాం" అని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు మన మార్కెట్ను బలి పెట్టలేదని ఆయన తేల్చి చెప్పారు.
అమెరికా వైన్కు గ్రీన్ సిగ్నల్.. కానీ నిబంధనలతో!
అమెరికా నుంచి దిగుమతి అయ్యే వైన్, స్పిరిట్స్, డిస్టిలర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ వంటి కొన్ని ఉత్పత్తులకు భారత్ రాయితీలు ప్రకటించింది. అయితే వీటి దిగుమతులను నియంత్రించడానికి కనీస దిగుమతి ధరను కూడా నిర్ణయించింది. అంటే ధర ఒక స్థాయి కంటే తగ్గకుండా చూడటం ద్వారా దేశీయ మార్కెట్ కుదేలు కాకుండా జాగ్రత్త పడింది. అలాగే అమెరికా సోయాబీన్ ఆయిల్కు కేవలం కోటా ఆధారిత సుంకాల రాయితీలు మాత్రమే లభిస్తాయని చెప్పింది.
ఎగుమతిదారులకు పండగ.. టారిఫ్ల భారీ తగ్గింపు
భారతీయ ఎగుమతిదారులకు ఈ ఒప్పందం భారీ ఊరటను ఇస్తోంది. గతంలో ఉన్న 50 శాతం సంకాన్ని ఏకంగా 18 శాతానికి తగ్గించడంతో.. ఎగుమతులు పెరిగాయి. చైనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ కావడం గమనార్హం కాగా.. దీనివల్ల భారతీయ రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, చేతివృత్తుల వారు, కళాకారులకు అమెరికా మార్కెట్లో గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఇది 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి మరింత ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa