భారత్-పాక్ మ్యాచ్కి ముందు రెచ్చగొట్టి మంటపెట్టిన మొహ్సిన్ నక్వీ.. ఆర్మీ చీఫ్ పేరును మధ్యలోకి లాగడంతో హీటెక్కిన వరల్డ్కప్!
అయితే టీ20 వరల్డ్ కప్కి కొంత సమయం ముందు.. తాము భారత్లో ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ను తొలగించి, స్కాట్లాండ్ను వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసింది. బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. తాము టీ20 వరల్డ్ కప్ ఆడతాం కానీ.. భారత్తో మ్యాచ్ను బాయ్ కాట్ చేస్తామని ప్రకటించింది. క్రికెట్ అభిమానులను ఈ ప్రకటన నివ్వెపరిచింది. టీ20 ప్రపంచ కప్ మొత్తం మీద అత్యధిక ప్రేక్షకాదరణతోపాటు యాడ్ రెవెన్యూ వచ్చే మ్యాచ్ ఇది.
దీంతో పాకిస్థాన్ తీరుపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం ఒప్పుకుంటే ఆడతామని పాక్ బోర్డు చెప్పింది. అయినా సరే పాక్ సర్కారు ఆడబోమంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించింది. అయితే మ్యాచ్ ఫిబ్రవరి 15న జరగాల్సి ఉండగా.. ఫిబ్రవరి 9న తన మనసు మార్చుకొని బాయ్కాట్ నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకుంది.
పాకిస్థాన్ రోజుల వ్యవధిలోనే తన మనసు మార్చుకొని, భారత్తో మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఐసీసీ చీఫ్గా ఉన్న జై షా పాకిస్థాన్ క్రికెట్ బోర్డును అష్ట దిగ్బంధనం చేశాడని చెప్పొచ్చు. భారత్తో మ్యాచ్ ఆడకపోతే.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇచ్చే రెవెన్యూ వాటాను ఆపేస్తామని, దీర్ఘకాలంపాటు ఆంక్షలు విధిస్తామని ఐసీసీ హెచ్చరించింది. మరోవైపు బ్రాడ్కాస్టర్ సైతం రంగంలోకి దిగి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పీసీబీకి వార్నింగ్ ఇచ్చింది. అదే జరిగితే నష్ట పరిహారంగా పీసీబీ భారీ మొత్తంలో చెల్లించాల్సి వస్తుంది. ఓవైపు ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం ఆగిపోయి, మరోవైపు బ్రాడ్కాస్టర్తో న్యాయపోరాటం చేయాల్సి వస్తే.. పీసీబీ ఆర్థిక కష్టాలు మామూలుగా ఉండవు.
అదే సమయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు, యూఏఈ బోర్డులు కూడా పీసీబీకి లేఖ రాశాయి. శ్రీలంక బోర్డు అయితే సెంటిమెంట్తో పాకిస్థాన్ను కొట్టింది. ఉగ్రవాద కాల్పుల కారణంగా మీ దేశంలో క్రికెట్ ఆడటానికి ఏ దేశమూ ముందుకు రాకపోతే.. మేం వచ్చి ఆడాం. ఇప్పుడు మా దేశంలో జరగబోయే మ్యాచ్ను బహిష్కరిస్తారా? దాని వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది. ఇదేనా మీ స్నేహ ధర్మం అన్నట్టుగా పీసీబీకి లేఖ రాసింది.
యూఏఈ క్రికెట్ బోర్డు కూడా బ్యాన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పీబీసీకి మెయిల్ చేసింది. ‘ఓ కుటుంబ సభ్యుడిలా మిమ్మల్ని కోరుతున్నాం. భారత్తో మ్యాచ్ ఆడొద్దనే నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోండి. దీని వల్ల అసోసియేట్ దేశాల ఆదాయంపై ప్రభావం పడుతుంది’ అని ఆ మెయిల్లో పేర్కొంది. పాకిస్థాన్లో క్రికెట్ సిరీస్ల నిర్వహణపై ఐసీసీ నిషేధం విధించిన సమయంలో.. యూఏఈ తన వేదికలను పాకిస్థాన్కు ఇచ్చి సాయపడింది. భవిష్యత్తులో పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్లను కూడా యూఏఈ లేదా శ్రీలంక లాంటి తటస్థ వేదికల్లోనే భారత్ ఆడనుంది. పాక్ బాటలోనే ఆ మ్యాచ్లను ఆడబోమని బీసీసీఐ ప్రకటిస్తే.. తమకు భారీ నష్టం వాటిల్లుతుందనేది ఈ బోర్డుల ఆందోళన. అందుకే ఈ రెండు బోర్డులు పీసీబీ మనసు మార్చేందుకు తమవంతు ప్రయత్నం చేశాయి.
ఇక భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడబోమంటూ టోర్నీ నుంచి బయటకు వెళ్లిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా.. భారత్తో మ్యాచ్ ఆడాలని పీసీబీకి రిక్వెస్ట్ చేసింది. క్రికెట్ మంచి కోసం ఆడండి అని పైకి చెప్పినప్పటికీ.. అసలు కారణాలు మాత్రం వేరే. ఇప్పుడు పాకిస్థాన్ కనుక భారత్తో మ్యాచ్ ఆడకపోతే.. పాకిస్థాన్తోపాటు టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపైనా ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం. అదే జరిగితే రెండు బోర్డులూ తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటాయి. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి బీసీబీ పాక్ను వాడుకుంది.
బీసీబీపై పెనాల్టీ విధించొద్దని, భారత్ తమ దేశంలో మ్యాచ్లు ఆడకపోవడం వల్ల రెవెన్యూ తగ్గుతోంది కాబట్టి.. తమ రెవెన్యూ వాటా పెంచాలని.. భవిష్యత్తులో అండర్-19 వరల్డ్ కప్ లాంటి టోర్నీలను బంగ్లాదేశ్లో నిర్వహించేలా చూడాలన్న పీసీబీ డిమాండ్ చేసింది. అయితే బీసీబీపై జరిమానా విధించకుండా ఉండటం, జూనియర్ ఐసీసీ ఈవెంట్లకు బంగ్లా ఆతిథ్యం ఇవ్వడం పట్ల ఐసీసీ సానుకూలంగా స్పందించింది.
ఓవైపు బ్రాడ్కస్టర్తో వార్నింగ్లు, రెవెన్యూ వాటాను ఆపేస్తామని ఐసీసీ హెచ్చరికలు.. శ్రీలంక, యూఏఈ క్రికెట్ బోర్డులు రాసిన లేఖలు.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సైతం ఆడమని కోరడం.. ఇవన్నీ కలిసి పాకిస్థాన్కు మరో దారి లేకుండా చేశాయి. వీటన్నింటి వెనుక ఉన్న శక్తి ఎవరో తెలుసు కదా..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa