ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో సన్నిహితంగా ఉంటోందని.. యువతిని కాల్చిన చంపిన ప్రియురాలు

national |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 08:51 PM

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పట్టపగలే కాల్పుల కలకలం సృష్టించాయి. ముఖ్యంగా ఓ 25 ఏళ్ల యువతి.. 19 ఏళ్ల అమ్మాయిపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకీ పెట్టి మరీ కాల్చింది. ఆపై అక్కడి నుంచి పారిపోయింది. కానీ పోలీసులు 12 గంటల్లోనే నిందితురాలిని పట్టుకుని విచారించగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. మృతురాలు.. తన ప్రియుడితో సన్నిహితంగా ఉంటోందనే కోపంతోనే ఆమెను చంపినట్లు అంగీకరించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


అసలేం జరిగిందంటే..?


ముంబై శివాజీ నగర్ పరిధిలోని ఫుర్కానియా మసీదు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని షిఫా షేక్ (19)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానికంగా ఉండే ఒక మహిళ నుంచి షిఫాకు ఫోన్ రావడంతో ఆమెను కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఫుర్కానియా మసీదు వద్ద వీరిద్దరూ కలుసుకున్న సమయంలో కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ గొడవ ముదరడంతో ఆగ్రహానికి గురైన నిందితురాలు తన వెంట తెచ్చుకున్న తుపాకీతో షిఫాపై కాల్పులు జరిపింది.


అయితే నిందితురాలు.. షిఫాను అతి దగ్గరి నుంచి నేరుగా ముఖంపైనే కాల్చగా.. బుల్లెట్ ఆమె దవడ భాగం నుంచి లోపలికి దూసుకెళ్లి పుర్రెలో ఇరుక్కుపోయింది. మరోవైపు కాల్చిన వెంటనే నిందితురాలు అక్కడి నుంచి పారిపోగా.. కాల్పుల శబ్దం విన్న స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆపై పోలీసులకు సమాచారం అందించి.. రక్తపు మడుగులో పడి ఉన్న షిఫాను ఘాట్‌కోపర్‌లోని రాజవాడి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే షిఫా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అప్పటికే ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు షిఫా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


12 గంటల్లోనే నిందితురాలి అరెస్ట్


ఆపై ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అలాగే బాధితురాలి కాల్ డేటాను కూడా చూసి.. దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆమె చనిపోవడానికి ముందు 25 ఏళ్ల మహిళ నుంచి ఫోన్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు 12 గంటల్లోనే ఆమెను పట్టుకున్నారు. అలాగే ఆమె షిఫాను కాలుస్తున్నప్పుడు పక్కనే మరో 23 ఏళ్ల యువకుడు కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని కూడా అరెస్ట్ చేశారు. ఆపై వీరిద్దరినీ విచారించగా.. తన ప్రియుడితో షిఫా సన్నిహితంగా ఉంటోందనే.. ఆమెను చంపినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు తెలుసుకున్నారు.


పట్టపగలే జనసంచారం ఉండే ప్రాంతంలో తుపాకీతో కాల్పులు జరగడం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అసలు నిందితురాలికి తుపాకీ ఎక్కడి నుంచి లభించింది? దీని వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వాలెంటైన్స్ వీక్ నడుస్తున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం యువతలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నిందితులపై హత్య కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa