ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అ ఒక్క రైతు ఓకే చెప్పడంతో,,,,విశాఖలో గూగుల్‌కు ఉన్న ఒక్క అడ్డంకి తొలగింది.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 03:48 PM

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. భూసేకరణ సమస్యలన్ని కొలిక్కి వచ్చాయి.. అవాంతరాలన్నీ దాటుకుని శంకుస్థాపనకు సిద్ధమవుతున్నారు. భూసేకరణకు ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు రైతుల్ని ఒప్పించి పరిహారం కూడా జమ చేశారు. ఈ భూసేకరణ ప్రక్రియలో మిగిలిన ఒక్క రైతు కూడా భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో గూగుల్ డేటా సెంటర్‌కు అడ్డంకులు తొలగిపోయాయి.. అన్నీ కుదిరితే వచ్చే నెలలోనే శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


గూగుల్ డేటా సెంటర్‌కు సంబంధించి భూసేకరణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తర్లువాడ రైతుల పేరుతో భూసేకరణపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఊహించని విధంగా కొందరు రైతులు తమ సంతకాలను ఫోర్జరీ చేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఆర్డీవో విచారణ కూడా జరిపారు. కొంతమంది రైతుల్ని ప్రలోభాలకు గురిచేసినట్లు తేలిందని వార్తలొచ్చాయి. తమకు భూములు ఇస్తే లక్షల్లో ఇస్తామని.. ప్లాట్ డెవలప్‌చేసి ఇస్తామని నమ్మించినట్లు గుర్తించారు. భూములు ఇచ్చేందుకు ఓకే చెబితే చాలు.. చెప్పిన దాంట్లో 50శాతం బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తామంటూ ఆఫర్లు ఇచ్చారు.


ఆ వెంటనే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. రైతుల సమస్యలు, భూసేకరణ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పరిహారాన్ని పెంచారు.. గతంలో రూ.17 లక్షలుగా ఉన్న పరిహారాన్ని.. రూ.40 లక్షలకు పెంచారు. అంతేకాదు 20 సెంట్ల భూమిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు రికార్డుల్లో లేని శివాయ్ జమేదార్ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైతులకు పరిహారాన్ని ఎకరాకు రూ.10 లక్షలకు పెంచారు. ఇటు ఇంటికో ఉద్యోగం, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్‌‌లో ఒక షాపు ఇలా హామీలు ఇచ్చారు. 520 మంది రైతులకు బంజరు భూముల అభివృద్ధి పథకం కింద 3సెంట్ల నివాస స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం పరిహారం పెంచడంతో పాటుగా మరికొన్ని వరాలు ప్రకటించడంతో రైతులు భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు.


ఈ భూసేకరణ ప్రక్రియలో ఒకే ఒక్క రైతు మిగిలారు. గణేష్ అనే రైతు మొన్నటి వరకు భూమిని ఇచ్చేందుకు నిరాకరించారు. ఆయన కూడా చివరికి భూమిని ఇచ్చేందుకు ముందుకొచ్చారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును రెండు రోజుల క్రితం కలిసి తన అసైన్డ్ భూమి రూ.1.94 ఎకరాలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే రెవెన్యూ అధికారుల్ని కలిసి భూమిని ఇచ్చేందుకు అంగీకార పత్రాలను సమర్పించారు. దీంతో భూసేకరణకు లైన్ క్లియర్ అయ్యింది. మరోవైపు విశాఖపట్నంలో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌‌కు అదనపు భూముల్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అదనపు భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రైడెన్‌కు 480 ఎకరాలు కేటాయించేందుకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు దానిని 601.40 ఎకరాలకు పెంచారు. రైడెన్ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వెయ్యి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa