ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే ఈ దాడుల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించి.. అనేక మంది నరకం చూస్తుంటే ఓ అజ్ఞాత ట్రేడర్ మాత్రం కొన్ని గంటల వ్యవధిలోనే కోట్లాది రూపాయలు వెనకేశాడు. ముఖ్యంగా పాలిమార్కెట్ అనే క్రిప్టో ఆధారిత ప్రిడిక్షన్ ప్లాట్ఫారమ్లో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. దాడులు జరుగుతాయని ముందే ఊహించి, భారీ ఎత్తున బెట్టింగ్ కాసిన సదరు వ్యక్తి వ్యవహారంపై ఇన్సైడర్ ట్రేడింగ్ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
71 నిమిషాల మిస్టరీ.. లక్షల డాలర్ల లాభం!
బ్లాక్చైన్ డేటా ప్రకారం.. మాగామీమాన్ అనే పేరున్న ఒక క్రిప్టో వాలెట్ ఖాతాదారుడు ఈ దాడుల ద్వారా ఏకంగా 4,31,146 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 3.9 కోట్లు) గెలుచుకున్నాడు. దౌత్యవేత్తలు శాంతి చర్చల గురించి మాట్లాడుతున్న సమయంలో.. మార్కెట్ కేవలం 27 శాతం మాత్రమే యుద్ధం జరిగే అవకాశం ఉందని అంచనా వేసినప్పుడు.. ఈ అజ్ఞాత ట్రేడర్ ధైర్యంగా 2,35,947 డాలర్లను దాడులు జరుగుతాయి అనే ఆప్షన్పై పెట్టుబడిగా పెట్టాడు.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెహ్రాన్పై దాడులు జరిగిన వార్త ప్రపంచానికి తెలియడానికి సరిగ్గా 71 నిమిషాల ముందే ఈ ఖాతాదారుడు తన చివరి బెట్టింగ్ను పూర్తి చేశాడు. అప్పుడు కేవలం 17 శాతంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని.. రాత్రికి రాత్రే తన పెట్టుబడిని ఐదు రెట్లు పెంచుకున్నాడు.
కేవలం ఇరాన్ పైనే గురి!
ఈ ట్రేడర్ గత చరిత్రను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అక్టోబర్ 2024 నుంచి ఈ ఖాతాదారుడు సుమారు 88 సార్లు ఇరాన్ సంబంధిత పరిణామాలపై మాత్రమే బెట్టింగ్ కాశాడు. ఎన్నికలు, క్రీడలు, బిట్కాయిన్ రేట్లపై కాకుండా.. కేవలం యుద్ధ గడువుల మీద, క్షిపణి దాడుల మీద మాత్రమే గురి పెట్టడం గమనార్హం. గత జనవరిలో కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుందని బెట్టింగ్ కాసి 2,78,079 డాలర్లు గెలుచుకున్నాడు.
ట్రంప్ కనెక్షన్పై చర్చ
ఈ ప్లాట్ఫారమ్ అయిన 'పాలిమార్కెట్' అడ్వైజరీ బోర్డులో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సభ్యుడిగా ఉన్నారు. గతంలో ఈ సంస్థపై అమెరికా ప్రభుత్వ విభాగాలు (డోజ్, సీఎఫ్టీసీ) దర్యాప్తు జరిపినప్పటికీ.. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దర్యాప్తులను నిలిపివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సైనిక చర్యల సమాచారం ముందే తెలిసి బెట్టింగ్లు కాస్తున్నారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa