ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవసరమైతే అభిషేక్‌ను ఫస్ట్ డౌన్‌లో ఆడించాలి,,,,,మ్యాచ్‌కి ముందు రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

sports |  Suryaa Desk  | Published : Wed, Mar 04, 2026, 10:23 PM

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో జరిగే కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టులో అభిషేక్ శర్మ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు. ఇటీవల ప్రసారమైన ఐసీసీ రివ్యూ మాట్లాడుతూ అభిషేక్ ఎంపిక పూర్తిగా అతడి మానసిక స్థితిపై ఆధారపడి ఉండాలని శాస్త్రి సూచించారు. “ఒక ఆటగాడు మెంటల్‌గా బలంగా లేకపోతే, ఎంత టాలెంట్ ఉన్నా ఇబ్బందే. అతడు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో కోచ్‌లు, మేనేజ్‌మెంట్ తెలుసుకోవాలి” అని ఆయన అన్నారు.


ఈ టోర్నీలో అభిషేక్ ప్రారంభం అంతగా ఆశాజనకంగా లేదు. వరుసగా మూడు డకౌట్లు, ఆహార విషబాధ కారణంగా ఒక మ్యాచ్‌కు దూరం కావడం, ఆ తర్వాత తక్కువ స్కోర్లు అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. సూపర్ ఎయిట్ దశలో సౌతాఫ్రికాపై 15 పరుగులు, జింబాబ్వేపై అర్ధసెంచరీ మాత్రమే కొంత ఊరటనిచ్చాయి. అయితే వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మళ్లీ విఫలమయ్యాడు.


ఈ పరిస్థితుల్లో జట్టు మార్పు అవసరమైతే, ఓపెనింగ్‌లో ఇషాన్ కిష‌న్‌ను పంపే అవకాశాన్ని పరిశీలించాలని శాస్త్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎడమచేతి బ్యాటర్ల ఆధిక్యం తగ్గించేందుకు సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో, ఇషాన్‌ను మూడో స్థానానికి పంపిన విషయం తెలిసిందే. అలాగే అవసరమైతే చివర్లో రింకూ సింగ్‌ను కూడా ఉపయోగించవచ్చని కూడా శాస్త్రి సూచించారు. అయితే ఇది చివరి ఆప్షన్ మాత్రమేనని స్పష్టం చేశారు.


మరోవైపు, ఇంగ్లండ్‌పై గతంలో అభిషేక్ చూపిన ప్రదర్శనను శాస్త్రి గుర్తు చేశారు. గతేడాది వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌పై అతడు చేసిన 135 పరుగుల ఇన్నింగ్స్ ఇప్పటికీ గుర్తుండిపోయిందన్నారు. అది భారత ఆటగాడు చేసిన అత్యధిక టీ20 స్కోర్లలో ఒకటని తెలిపారు. “అలాంటి ఆటగాడిపై నమ్మకం కోల్పోవడం సరైంది కాదు. అతడికి టాలెంట్ ఉంది, అనుభవం ఉంది. గతంలో అతడు ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అందుకే నేను అయితే అతడిని కొనసాగిస్తాను” అని శాస్త్రి స్పష్టం చేశారు.


మొత్తంగా చూస్తే, ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌కు ముందు అభిషేక్ శర్మ భవితవ్యం అతడి మెంటల్ స్ట్రెంగ్త్‌పైనే ఆధారపడి ఉందని రవి శాస్త్రి వ్యాఖ్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. జట్టు మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. భారత్ - ఇంగ్లండ్ మధ్య టీ20 వరల్డ్‌కప్ 2026 రెండో సెమీ ఫైనల్‌ గురువారం జరగనుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa