ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవి బెంగాల్ బదిలీ,,,,తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 07:29 PM

కేంద్రం తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ గురువారం (మార్చి 5) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ ఆకస్మికంగా రాజీనామా చేయగా.. ఆ తర్వాత పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఆయన ఆ స్థానంలో ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న శివ్‌ప్రతాప్‌ శుక్లాను తెలంగాణ గవర్నర్‌గా నియమించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత 2024 జులైలో జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. దాదాపు ఏడాదిన్నరకు పైగా గవర్నర్‌గా సేవలించిందిన జిష్ణుదేవ్‌ వర్మ ఇప్పుడు మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఇక వివాదాస్పద నిర్ణయాలు, చర్యలతో నిత్యం వార్తల్లో నిలిచే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్ రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బదిలీ చేశారు.


కొత్త గవర్నర్లు వీరే..


తెలంగాణ -శివప్రతాప్ శుక్లా (ఇప్పటి వరకు ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు.)


మహారాష్ట్ర- జిష్ణుదేవ్ వర్మ (ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్‌గా ఉన్నారు.)


నాగాలాండ్- నందకిశోర్ యాదవ్ (కొత్తగా నియమించారు.)


బిహార్- రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ (కొత్తగా నియమితులయ్యారు.)


ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌- తరంజిత్ సింగ్ సంధు ( కొత్తగా నియమితులయ్యారు.)


లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌- వినయ్ కుమార్ సక్సేనా (ఇప్పటి వరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు.)


హిమాచల్ ప్రదేశ్- కవీందర్ గుప్తా (ఇప్పటి వరకు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నారు.)


తమిళనాడు గవర్నర్- రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ (ప్రస్తుతం ఆయన కేరళ గవర్నర్‌గా ఉండగా అదనపు బాధ్యతలు అప్పగించారు.)


పశ్చిమ బెంగాల్- ఆర్.ఎన్ రవి (ఇప్పటి వరకు తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు.)


తెలంగాణ కొత్త గవర్నర్ శుక్లా నేపథ్యం ఇదే..


తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా 1952 ఏప్రిల్‌ 1న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ జిల్లా రుద్రాపుర్‌ గ్రామంలో జన్మించారు. రుద్రాపుర్‌లో ప్రాథమిక విద్య, గోరఖ్‌పుర్‌లో కాలేజీ విద్య పూర్తిచేశారు. న్యాయశాస్త్రంలో ఆయన పట్టభద్రుడు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీ సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. 1983లో బీజేపీ పార్టీలో చేరారు. 1989లో తొలిసారి గోరఖ్‌పుర్‌ నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు.


1991లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. యూపీ విద్యాశాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు. 1993, 1996 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు 1996లో కల్యాణ్‌సింగ్, రామ్‌ప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్‌ల ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పని చేశారు. 2016లో యూపీ నుంచి రాజ్యసభకు ఎంపిక కాగా.. 2017లో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఫిబ్రవరిలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. తాజాగా తెలంగాణకు గవర్నర్‌గా బదిలీ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa