ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌లో ప్రభుత్వం కూలిపోయే ఛాన్సే లేదు.. అమెరికా నిఘా సంచలన నివేదిక

international |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 07:51 PM

దాదాపు రెండు వారాలు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్నా.. ఇరాన్‌లో నాయకత్వం స్థిరంగానే ఉందని, ఇప్పట్లో ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదని అమెరికా నిఘా సంచలన నివేదిక బయటపెట్టింది. యుద్ధ పరిణామాలకు సమీపంగా ఉన్న విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా ఇంటెలిజెన్స్‌ ఈ నివేదిక ప్రచురించింది. అమెరికా గూఢచారి వర్గాలు సేకరించిన పలు నివేదికలు... ప్రస్తుతం ఇరాన్‌లో ప్రభుత్వానికి తక్షణ ముప్పులేదని ఒక వర్గం పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికీ ప్రజలపై ప్రభుత్వానికి నియంత్రణ కొనసాగుతుందని పేరు చెప్పడానికి నిరాకరించిన అధికార వర్గాలు సూచించినట్టు తెలిపింది. ఈ నివేదిక కొద్ది రోజుల కిందటే అగ్రరాజ్యం ఇంటెలిజెన్స్ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వివరించాయి.


చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ భయాల నేపథ్యంలో ఒత్తిడి పెరుగుతున్నందున 2003 తర్వాత అమెరికా చేపట్టిన అతిపెద్ద ఈ సైనిక ఆపరేషన్‌ను త్వరగా ముగిస్తామనే సంకేతాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. కానీ, ఇరాన్ నాయకత్వం కఠిన వైఖరి కొనసాగితే యుద్ధానికి ఆమోదయోగ్యమైన ముగింపు అంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఫిబ్రవరి 28న జరిపిన దాడిలో ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించినా.. ఇప్పటికీ ఇరాన్‌లో మతాధికారుల నాయకత్వ వ్యవస్థ ఐక్యంగా కొనసాగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. అటు, ఇజ్రాయెల్ అధికారుల అంతర్గత చర్చల్లోనూ ప్రస్తుత యుద్ధం కారణంగా ఇరాన్‌లో ఇస్లామిక్ ప్రభుత్వం పతనం అవుతుందనే నమ్మకం లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్టు ఆ దేశ ఓ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్‌‌ నివేదించింది. అయితే, క్షేత్రస్థాయిలో అంతర్గత రాజకీయ సమీకరణాలు ఎప్పుడైనా మారే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ కార్యాలయం, వైట్‌హౌస్ తక్షణమే స్పందించడానికి నిరాకరించాయి.


ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత.. గగనతల రక్షణ, అణు స్థావరాలు, సీనియర్ నాయకత్వం‌ సహా అనేక లక్ష్యాలపై దాడులు నిర్వహించాయి. ఈ యుద్ధానికి ట్రంప్ యంత్రాంగం వివిధ కారణాలు వెల్లడించింది. ఆపరేషన్ మొదలైనప్పుడు.. ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. కానీ, ఇరాన్‌ ప్రభుత్వాన్ని మార్చడం తమ ఉద్దేశం కాదని అమెరికా ఉన్నతాధికారులు తర్వాత ప్రకటించారు.


దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా పదుల సంఖ్యలో ఉన్నతస్థాయి నాయకులు, అధికారులు హతమైనా ఇస్లామిక్ ప్రభుత్వానికి పాలనపై ఏ మాత్రం పట్టుసడల్లేదని నివేదిక పేర్కొంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ప్, తాత్కాలిక నాయకత్వం ఇప్పటికీ ప్రజలపై పూర్తిగా నియంత్రణ కొనసాగిస్తుందని అమెరికా నిఘా నివేదిక అభిప్రాయపడింది. అసెంబ్లీ నిపుణుల కమిటీ.. ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని ఇటీవల నూతన సుప్రీం లీడర్‌గా ఎన్నుకుంది.


కానీ, ఇజ్రాయెల్ మాత్రం పాత ప్రభుత్వ అవశేషాలను కొనసాగించబోమని, మతతత్వ వాదులను వదలిపెట్టబోమని తేల్చిచెప్పంది. అయితే, ప్రస్తుతం జరుగుతోన్న ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఖమేనీ ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తాయనేది స్పష్టతలేదు. ఇరాన్‌ ప్రజలు వీధుల్లోకి వచ్చిన సురక్షితంగా నిరసన తెలిపేందుకు వీలుగా భూతల దాడి చేపట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ట్రంప్ యంత్రాంగం ఇరాన్‌లోకి అమెరికా దళాలను పంపే అవకాశాన్ని తోసిపుచ్చలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa