నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా, ఎన్నికల తేదీల ప్రకటనకు కొద్ది గంటల ముందు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన జనరంజక పథకాల ప్రకటనలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై తాము జోక్యం చేసుకోలేమని ఆయన స్పష్టం చేశారు.ఆదివారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడిన సీఈసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందు రాష్ట్రాలు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు కోడ్ అమల్లోకి వచ్చింది అని తెలిపారు. ఎన్నికలు హింస, ప్రలోభాలకు తావు లేకుండా నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పురోహితులు, మౌజన్లకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనాన్ని రూ. 500 పెంచుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత సీఈసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ. 10,000 జమ చేస్తామని ఆ పార్టీ నేత కె. అన్నామలై హామీ ఇచ్చారు. గత నెలలోనే అధికార డీఎంకే ప్రభుత్వం 'కళైనార్ మగళీర్ ఉరిమై తిట్టం' పథకం కింద 1.31 కోట్ల మంది మహిళలకు రూ. 5,000 చొప్పున జమ చేసింది.షెడ్యూల్ ప్రకారం, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తారు. అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఈ అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టి, అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. వీటితో పాటు గోవా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, త్రిపుర రాష్ట్రాల్లోని 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నట్లు, వాటి ఫలితాలు కూడా మే 4నే వెల్లడిస్తామని సీఈసీ తెలిపారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయనున్న యువత ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa