కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు మారిపోయింది బంగారం పరిస్థితి. పచ్చలోహం ముట్టుకోకుండానే భగ్గమని కాక పెడుతోంది. పసిడిపై ఆశకు తోడు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ కారణాలు తోడు కావడంతో స్వర్ణం మీ చేతులకు చిక్కనని చుక్కలను తాకుతోంది. ఈ రోజు మార్కెట్లో 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారు 10 గ్రాములకు రూ. 35700 పలికింది. 22 కేరట్ల రూ. 33,100 దాటిపోయింది. బంగారం ధర పక్షం రోజులుగా అమాంతంగా పెరుగుతోంది. పెంపు వందల్లోనే ఉంటోంది.
ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. కీలకమైన అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు గాడి తప్పుతున్నాయి. బ్యాంకుల తక్కువ వడ్డీలకు అప్పులు ఇస్తుండగా, అవి కస్టమర్లకు ఇస్తున్న వడ్డీ కూడా పల్చబడింది. దీంతో జనంతోపాటు కంపెనీలు, వ్యాపారులు బంగారాన్ని కొనిపడేస్తున్నాయి. మరోపక్క.. అమెరికా, ఇరాన్ల గొడవ ఆజ్యం పోస్తోంది. వాటి మధ్య యుద్ధం వస్తే కువైట్ యుద్ధం నాటి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశముంది. అదే జరిగితే గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. అమెరికాకు చైనాకు మధ్య పన్నుల యుద్ధం కూడా బంగారం ధరను ప్రభావితం చేస్తోంది. అమెరికా చర్యలకు ప్రతీకారంగా కొన్ని గల్ఫ్ దేశాలు ముడిచమురు ధరలను పెంచడం లేకపోతే, ఎగుమతులను తగ్గించడం వంటివి చేస్తున్నాయి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోడానికి ముందు జాగ్రత్తగా నిధులను బంగారంవైపు మళ్లిస్తుండడంతో దానికి గిరాకీ పెరిగి ధర భగ్గుమంటోంది. ఇరాన్పై యుద్ధం చేయొద్దని అమెరికా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నా ఉద్రిక్త పరిస్థితి, వడ్డీ రేట్ల పతనం కొనసాగినంత కాలం బంగారం ధర పెరుగుతూనే ఉంటుందని అంచనా. దీంతోపాటు పెళ్లిముహూర్తాలు, దసరా, దీపావళి వేడుకల కారణంగానూ రాబోవు ఆరేడు నెలల్లో ధర రూ. 40 వేలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa