విశాఖపట్నంలో కోట్ల రూపాయల విలువైన భూములపై ఉన్న వివాదాలను గుర్తించి, వాటిని సెటిల్మెంట్ చేసుకోకుంటే భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చేస్తామంటూ ఓ ముఠా రంగంలొకి దిగటం పట్ల స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే సింబియోసిస్ టెక్నాలజీస్ సీఈఓ ఓరుగంటి నరేశ్కుమార్ బావ కాట్రగడ్డ లలితేశ్ ఆరెకరాల యూఎల్సీ మిగులు భూమిని చాలా ఏళ్ల క్రితమే కొనుగోలు చేసారు. విశాఖ పరిధిలో మర్రిపాలెంలో ఉన్న ఈ భూమిలో 200గజాల్లో ఓ ఆక్రమణదారు పాగా వేయటంతో ఆతన్ని ఖాళీ చేయించేందుకు నష్టపరిహారం పేరుతో కొంత మొత్తం చెల్లించారు. అయితే ఈ వివాదం న్యాయస్థానంకు చేరుకోవటంతో చివరికి నరేశ్కుమార్ కుటుంబానికి అనుకూలంగా కోర్టు ఆదేశాలివ్వటంతో ప్రభుత్వం జీఓ విడుదల చేసింది కూడా. అయితే పదేళ్లుగా ఆ భూమి ని స్వాధీనం చేసుకుని సంక్షణ బాధ్యతలు నరేశ్కుమార్ చూస్తున్నా, 2013లో హైదరాబాద్కు చెందిన బాలకృష్ణ మోహన్ అనేవ్యక్తి జీపీఏ రాయించుకొని, ఈ భూమి తనదంటూ మరో రిట్ పిటిషన్ వేశారు.
ఈ వ్యవహారం ఇంకా కోర్టులో ఉండగానే నరేశ్కుమార్ఇంటికి వచ్చిన కొందరు పులివెందుల నుంచి వచ్చామని, సీఎం జగన్కు అత్యంత సన్నిహితులమని పరిచయం చేసుకుని, వ్యవహారం సెటిల్ చేసుకోకుంటే ప్రభుత్వం తీసేసుకుంటుందని హెచ్చరికలు జారీ చేసారు. దీంతో అవాక్కయిన ఆయన మీరు జగన్కు మాత్రమే సన్నిహితులు నేను బిజెపి అధినేత, కేంద్ర మంత్రి అమిత్షాకు సన్నిహితుడినంటూ తేల్చి చెప్పడంతో చల్లగా జారుకున్నారు.
ఈ పులివెందుల ముఠా బెదిరిపుల విషయాన్ని మంత్రి అవంతి దృష్టికి తీసుకెళ్లానని చెప్పిన నరేష్ సోమవారం సీపీకి ఫిర్యాదు చేసారు. కాగా నరేశ్కుమార్ ఇంటి ప్రాంగణంలోని సీసీకెమెరా ఫుటేజీ చూసిన పలువురు వచ్చిన వ్యక్తులలో పులివెందులకు చెందిన బాలనారాయణరెడ్డి(రిమ్స్ నిర్వహణ కాంట్రాక్టర్), వేల్పుల రాము, లింగాల రామలింగారెడ్డి ఉన్నట్టు చెపుతున్నారు.
కాగా ఈ వ్యవహారానికి ఆద్యుడైన బాలకృష్ణ మోహన్ విశాఖలో మీడియాతో మాట్లాడు తను జిపిఏ చేసుకున్న భూమి వివాదం విషయంలో మాట్లాడడానికే కొందరిని నరేష్ ఇంటికి పంపానని, వారిది పులివెందుల అంటూ ప్రచారం చేయటం సరికాదని అన్నారు. వారంతా హైదరాబాద్ వాసులేనని, వెళ్లిన వారు సామరస్యంగా మాట్లాడితే... నరేష్ మాత్రం అమిత్షా పేరు ప్రస్తావిస్తూ, బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నానని అన్నారు. అయితే నరేష్ వచ్చినవారిది పులివెందులగా కొందరు గుర్తించారు కదా? అని ప్రశ్నిస్తే మాత్రం ఆ విషయం పై స్పందించేందుకు నిరాకరించాడు బాలకృష్ణ మోహన్. కాగా ఇదే విశాఖ పరిధిలోని గాజువాకలో తాజాగా రెండు భూ వివాదాలను ఈ ముఠా సెటిల్మెంట్ చేసిందని , ఈ మేరకు భారీ మొత్తాలు చేతులు మారాయని ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa