ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై పిల్లలకు మొబైల్ ఫోన్లు, షార్ట్స్‌ బంద్.. సర్కారు సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 08:03 PM

ఉత్తర ప్రదేశ్‌లో సంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణ పేరుతో ఖాప్ పంచాయతీలు మరోసారి వార్తల్లో నిలిచాయి. బాగ్‌పత్ జిల్లాలో సమావేశమైన ఖాప్ పంచాయతీ ప్రతినిధులు.. యువత జీవనశైలిపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. టీనేజర్లకు స్మార్ట్‌ఫోన్లు వాడటం నుంచి, వారు ధరించే దుస్తుల వరకు పలు అంశాలపై ఆంక్షలు విధిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు.


నిక్కర్లు వద్దు.. స్మార్ట్‌ఫోన్లు అసలే వద్దు!


పాశ్చాత్య పోకడలు మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయనే ఆందోళనతో థాంబ దేశ్ ఖాప్ చౌదరి బ్రజ్‌పాల్ సింగ్, దగాద్ ఖాప్ చౌదరి ఓంపాల్ సింగ్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 18 నుంచి 20 ఏళ్ల లోపు యువతీ యువకులు స్మార్ట్‌ఫోన్లు వాడకూడదని పంచాయతీ తీర్పునిచ్చింది. మొబైల్ ఫోన్లు ఇవ్వడం వల్ల పిల్లలు చెడు అలవాట్లకు లోనవుతున్నారని.. చదువుపై దృష్టి పెట్టడం లేదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ఫోన్లు అస్సలే వాడకూడదని.. ఫోన్లను ఇంట్లోనే ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ బహిరంగ ప్రదేశాల్లో షార్ట్స్ ధరించడాన్ని నిషేధించారు. ఇది మన సామాజిక విలువలపై ప్రభావం చూపుతోందని పంచాయతీ పేర్కొంది.


పెళ్లిళ్లపై కొత్త గైడ్‌లైన్స్


కేవలం యువతపైనే కాకుండా పెళ్లి వేడుకల విషయంలోనూ ఖాప్ పంచాయతీ కీలక సూచనలు చేసింది. వివాహాలు ఫంక్షన్ హాళ్లలో కాకుండా.. గ్రామాల్లో లేదా సొంత నివాసాల్లోనే జరుపుకోవాలని పేర్కొంది. మ్యారేజ్ హాల్ కల్చర్ వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అతిథుల సంఖ్యను పరిమితం చేయాలని చెప్పారు. ఆడంబరాలకు పోయి విపరీతంగా ఖర్చు కూడా చేయకూడదన్నారు. శుభలేఖల ముద్రణ ఖర్చును తగ్గించేందుకు.. భౌతిక కార్డులకు బదులు వాట్సాప్ ద్వారానే ఆహ్వానాలు పంపాలని కోరారు.


రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం..


ఈ నిర్ణయాలు కేవలం బాగ్‌పత్‌కే పరిమితం కాకుండా ఉత్తరప్రదేశ్ అంతటా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఖాప్ నేతలు తెలిపారు. ఇతర జిల్లాల ఖాప్ నాయకులతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. రాజస్థాన్‌లో ఇప్పటికే తీసుకున్న ఇలాంటి నిర్ణయాలను కూడా ఈ సందర్భంగా వారు సమర్థించారు. "పిల్లలు తమ కుటుంబ పెద్దలతో కలిసి కూర్చుని, సామాజిక మార్గదర్శకాలను నేర్చుకోవాలి. ఫోన్లకు బానిసలై విలువలను మర్చిపోకూడదు" అని స్థానిక నివాసి నరేష్ పాల్ పంచాయతీ నిర్ణయాన్ని సమర్థించారు. ప్రస్తుతం ఈ నిర్ణయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa