ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు 300కు పైగా లోకల్ రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే

national |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 08:06 PM

ముంబయి నగర జీవనాడి అయిన లోకల్ రైలు ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. పశ్చిమ రైల్వే పరిధిలోని కాండివ్లీ - బోరివలీ స్టేషన్ల మధ్య ఆరో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా భారీగా రైళ్ల రద్దును ప్రకటించారు. డిసెంబర్ 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రతిరోజూ సుమారు 320 నుంచి 350 లోకల్ సర్వీసులు రద్దు కానున్నట్లు రైల్వే అధికారులు ధృవీకరించారు. దీనివల్ల నిత్యం కార్యాలయాలకు, వ్యాపారాలకు వెళ్లే లక్షలాది మంది సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.


రైళ్ల రద్దుకు అసలు కారణం ఇదే..!


ముంబయి అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా బోరివలీ నుంచి ముంబయి సెంట్రల్ వరకు ప్రత్యేకంగా ఆరో రైల్వే లైన్‌ను నిర్మిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశం.. లోకల్ రైళ్లు, సుదూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయడం. తద్వారా లోకల్ రైళ్లు వేగంగా, ఎలాంటి అంతరాయం లేకుండా నడవడానికి వీలవుతుంది. ప్రస్తుతం కాండివ్లీ - బోరివలీ మధ్య సిగ్నలింగ్ వ్యవస్థ మార్పులు, నాన్-లింకింగ్ పనుల కోసం ఈ 30 రోజుల మేజర్ బ్లాక్ తీసుకున్నట్లు వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ తెలిపారు.


ముఖ్యమైన తేదీలు.. ప్రయాణికులు జాగ్రత్త!


రైల్వే అధికారుల సమాచారం ప్రకారం.. ఈ పనులు డిసెంబర్ 20వ తేదీన ప్రారంభమై 2026 జనవరి 18వ తేదీ రకు కొనసాగనున్నాయి. అయితే పనుల తీవ్రత దృష్ట్యా.. డిసెంబర్ 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రతిరోజూ 350 రైళ్ల వరకు రద్దు కానున్నాయి. అలాగే వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన మరోసారి భారీ స్థాయిలో సర్వీసుల రద్దు ఉంటుంది. ప్రయాణికులకు తక్కువ ఇబ్బంది కలగాలనే ఉద్దేశంతో ఎక్కువ శాతం పనులను అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున 5 గంటల లోపే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయినప్పటికీ.. పగటిపూట కూడా సర్వీసుల తగ్గింపు వల్ల స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.


ప్రస్తుతానికి ప్రయాణికులకు ఇబ్బంది కలిగినప్పటికీ.. జనవరి 18వ తేదీ నాటికి కాండివ్లీ - బోరివలీ మధ్య 3.5 కిలోమీటర్ల కొత్త లైన్ అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త మార్గం అందుబాటులోకి వస్తే ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లో ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. వెస్ట్రన్ రైల్వే ప్రస్తుతం రోజుకు 1,400కు పైగా సర్వీసులను చర్చిగేట్ నుంచి దహాను వరకు నడుపుతోంది. ఈ కొత్త లైన్‌తో రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గుతుందని రైల్వే వర్గాలు ఆశిస్తున్నాయి. అలాగే ముంబయి ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని ముందే ప్లాన్ చేసుకోవాలని, రైల్వే వెబ్‌సైట్ లేదా యాప్‌లో తాజా షెడ్యూల్‌ను తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa