రోహిణి సింధూరి.. ఐఏఎస్. ఈ పేరు అందరికి సుపరిచితమే. తన విధి నిర్వహణలో రాజకీయ నాయకులను సైతం లెక్క చేయని నైజం ఆమెది. కానీ ఆమె నిజాయితీకి బహుమానంగా నాలుగు సార్లు బదిలీ అయ్యింది. తాజాగా మరోసారి సింధూరి బదిలీ అయ్యింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక లేడీ సింగంగా పేరు గాంచిన రోహిణి సింధూరి ప్రస్తుతం కర్ణాటక భవన నిర్మాణ సంక్షేమ శాఖ అధికారిగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల వరదలు వచ్చిన నేపథ్యంలో రూ.1000 కోట్ల భవన నిర్మాణ సంక్షేమ శాఖ నిధులను విపత్తు సహాయ నిధికి మళ్లించాలని కర్ణాటక సీఎం యడియూరప్ప కోరారు. దీనికి రోహిణి సింధూరి ఒప్పుకోలేదు. దీంతో సీఎం యడియూరప్ప సింధూరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమెను భవన నిర్మాణ శాఖ నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 24న ఆదేశాలిచ్చింది. ముందుగా ఆమెను సెప్టెంబర్ 20 న బదిలీ చేస్తున్నట్టుగా ఆదేశాలిచ్చారు. ఆమెను పట్టు పరిశ్రమ శాఖాధికారిగా నియమిస్తూ సెప్టెంబర్ 24న ఉత్తర్వులిచ్చారు. ఆమె బదిలీకి సీఎం యడియూరప్ప కోపమే కారణంగా తెలుస్తోంది. సింధూరి కన్నడ నాట నిజాయితీ కలిగిన అధికారిగా పేరు తెచ్చుకుంది. అక్రమాలు జరిగితే వారు ఎంతటి వారైనా సరే ఆమె సహించదు. ప్రజాధనం వృథా చేస్తే ఆమె ఊరుకోదు. గతంలో కూడా పలుసార్లు ప్రజాప్రతినిధులకు ఎదురు చెప్పి బదిలీ అయ్యింది. ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రికే కోపం రావడంతో బదిలీ అయ్యింది. రోహిణి సింధూరి స్వస్థలం ఖమ్మం. ఆమె నెల్లూరు జిల్లా వాసిని వివాహం చేసుకుంది. ఐఏఎస్ కు ఎంపికైన సింధూరి కర్ణాటక సర్వీస్ ను ఎంచుకుంది. కన్నడ నాట మంచి ఐఏఎస్ అధికారిగా పేరు తెచ్చుకుంది. తాజాగా రోహిణి సింధూరి బదిలీ కావడంతో ఆమె మరోసారి చర్చనీయాంశమయ్యారు. రోహిణి సింధూరిని డిప్యూటేషన్ పై సీఎం జగన్ ఏపీకి తీసుకు వస్తారని చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం దాని పై ఎటువంటి స్పష్టత లేదు. రోహిణి సింధూరి నిజాయితిని ప్రశంసిస్తూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తన విధానాలతో కర్ణాటక లేడీ సింగంగా ఆమె పేరు తెచ్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa