ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ స్ధాయిలో కీర్తి పతాకాన్నిఎగురవేసిన ప‌ర్యాట‌క శాఖ‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 05:49 AM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం జాతీయ స్ధాయిలో మరోసారి కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డులలో మూడింటిని కైవసం చేసుకోవటం ద్వారా రాష్ట్ర పర్యాటకం తన సత్తా చాటింది. కొత్త డిల్లీ వేదికగా జరిగిన ప్రత్యేక వేడుకలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడు చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, ఆంద్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఆంధ్రప్రదేశ్ పర్యటక అభివృద్ది సంస్ధ నిర్వహణ సంచాలకులు ప్రవీణ్‌కుమార్  ఈ అవార్డులు అందుకున్నారు. మొత్తం మూడు విభాగాలలో జాతీయ స్ధాయి అవార్డులు దక్కించుకోగా ఉత్తమ పర్యటక రాష్ట్రంగా అత్యున్నత స్ధాయి పురస్కారం రాష్ట్రానికి రావటం విశేషమని ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక , క్రీడా యువజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నామని, ఆ క్రమంలోనే తమ శాఖ ఈ పురస్కారాలను దక్కించుకుందన్నారు. ఆంగ్ల భాషలో అత్యున్నత పర్యాటక ప్రచురణను సైతం ఏపి పర్యాటక రంగమే రూపొందించగలిగిందని ముఖ్య కార్యదర్శి వివరించారు.  జాతీయ స్దాయిలో స్నేహ పూర్వక రైల్వే స్టేషన్ గా విశాఖపట్నం దక్కించుకోవటం సాధారణ విషయం కాదని వివరించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇదే పరంపరను కొనసాగిస్తామని, పర్యాటక అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారని తెలిపారు. పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే ఈ అవార్డులు దక్కించుకోగలిగామని, ఇది త‌మ బాధ్యతను మరింత పెంచిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa