ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తారంధ్రాను ముంచెత్తుతున్న బంగాళఖాతం అల్పపీడనం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2019, 07:01 PM

కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో, నైరుతి బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం వ్యాప్తంగా సగటున 12.7 సెం.మీ. వర్షపాతం కురిసింది. అత్యధికంగా మందసలో 22.4 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. వరద కారణంగా గురువారం మన్యం ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో కోసిన వరి పనలు నీటిలో తేలియాడుతున్నాయి.విద్యుత్తు స్తంభాలు పడిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. వంశధార, నాగావళి, బాహుదా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మడ్డువలస ప్రాజెక్టు ఏడుగేట్ల నుంచి 30,600 క్యూసెక్కుల నీటిని నాగావళిలోకి వదలుతున్నారు. గొట్టాబ్యారేజి 22 గేట్లను ఎత్తి 68 వేల క్యూసెక్కులను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. తోటపల్లి బ్యారేజి నాలుగు గేట్లు పైకెత్తి 8 వేల క్యూసెక్కులను నాగావళిలోకి వదులుతున్నారు. ఇచ్ఛాపురంలో బాహుదానదికి ఒడిశా నుంచి గురువారం సాయంత్రానికి 44,342 క్యూసెక్కుల నీటిని వదిలారు.విశాఖ మన్యంలో మత్స్యగెడ్డ ఉగ్రరూపం దాల్చింది. పాడేరు-పెదబయలు మండలాల సరిహద్దు పరదానిపుట్టు సమీపంలో వరద ఉద్ధృతిలో తన వాహనం కొట్టుకుపోకుండా చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. ముంచంగిపుట్టు, జి.ముంచంగిపుట్టు, గుత్తులపుట్టు, కె.కోడాపల్లి, కించూరు తదితర పంచాయతీల్లోని 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భీమిలిలో అత్యధికంగా 23 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. విజయనగరం జిల్లాలో గరిష్ఠంగా 13.5 సెం.మీ, కనిష్ఠంగా 10.4 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది.గుర్ల, గరివిడి, భోగాపురం, నెల్లిమర్ల, దత్తిరాజేరు, సాలూరు, పాచిపెంట తదితర మండలాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. విజయనగరం, నెల్లిమర్ల, పార్వతీపురం, సాలూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ప్రధాన మార్కెట్‌కు వెళ్లే రోడ్డులోకి పెద్ద చెరువు నీరు ప్రవహించింది. గుర్ల సమీపంలోని ఎస్‌ఎస్ఆర్‌ పేట వద్ద కెల్ల గెడ్డ పొంగడంతో పాలకొండ, రాజాం, చీపురుపల్లి, గరివిడి వెళ్లాల్సిన బస్సులు నిలిచిపోయాయి.నెల్లిమర్ల వద్ద చంపావతి నది కాజ్‌వే పై నుంచి ప్రవహించింది. 15వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. సీతానగరం మండలంలో సువర్ణముఖి నదిపై ఉన్న అంతర్రాష్ట్ర వంతెన మధ్యభాగం కుంగింది. ఇప్పటికే శిథిలమైన ఈ వంతెన వర్షాలకు బాగా నానిపోయి శ్లాబు బీటలిచ్చి కిందకు కుంగిపోయింది. పోలీసులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపేశారు.తూర్పుగోదావరి జిల్లాలో ఏలేడు కాల్వ ఉగ్రరూపం దాల్చింది. పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని 15 వేల ఎకరాల పంట నీటమునిగింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, చందర్లపాడు, తోట్లవల్లూరు, కంచికచర్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. విజయవాడ కృష్ణలంక పరిధిలోని ఇళ్లల్లోకి నీరు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa