శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శుక్రవారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, తోమలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు.
ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు. 9.00 నుంచి 10.30 గంటల వరకు ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు ఆలయంలోని మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు.
సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa