క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్ తొలినాళ్లలోనే సెలక్టర్ల నుంచి చేదు అనుభవం ఎదురైందట. జట్టులోకి అతడ్ని ఎంపిక చేయని సెలక్టర్లు.. ఇంకా ఆటని మెరుగు పర్చుకోవాలని సూచించినట్లు సచినే స్వయంగా వెల్లడించాడు.ముంబయిలోని ఓ స్కూల్ విద్యార్థులతో సచిన్ మాట్లాడుతూ ‘పదకొండేళ్ల వయసులో నా క్రికెట్ జర్నీ ప్రారంభమైంది. అప్పట్లో నా మైండ్లో ఒక్కటే ఉండేది. అది భారత్ జట్టుకి ఆడాలని. నా ఫస్ట్ సెలక్షన్స్ ట్రయల్స్ ఇంకా నాకు గుర్తుంది. జట్టులోకి నన్ను ఎంపిక చేయకుండా పక్కన పెట్టిన సెలక్టర్లు.. ఆటని ఇంకా మెరుగు పర్చుకోవాలని సూచించారు. వాస్తవానికి అప్పటికి నేను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. అయినప్పటికీ.. సెలక్టర్లు అలా నన్ను పక్కన పెట్టడంతో నిరాశకి గురయ్యా. కానీ.. ఆ తర్వాత కష్టపడి నా ఆటని మరింత మెరుగుపర్చుకున్నా. మీ కలని నెరవేర్చుకోవాలంటే కష్టపడాలి తప్ప.. అడ్డదారులు ఏమాత్రం సాయపడవు’ అని విద్యార్థులకి సచిన్ ఉపదేశించాడు. భారత్ తరఫున 24 ఏళ్లపాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ 200 టెస్టులు, 463 వన్డేలు ఆడాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 51 సెంచరీలు బాదిన మాస్టర్.. వన్డేల్లోనూ 49 శతకాలు సాధించాడు. మొత్తంగా.. అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాల మార్క్ని అందుకున్న ఏకైక క్రికెటర్గా నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa