ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ సిక్సర్ల వర్షంతో ధోనీ రికార్డు బద్దలు!

national |  Suryaa Desk  | Published : Fri, Nov 08, 2019, 01:18 PM

బంగ్లాదేశ్‌తో గురువారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (85; 43 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్‌ 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. చివరి మ్యాచ్‌ ఆదివారం నాగ్‌పూర్‌లో జరుగుతుంది. రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ ఆరు సిక్సుర్లు కొట్టడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (37) బాదిన భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ధోనీ (34) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ధోనీ 62 ఇన్నింగ్స్‌లో 34 సిక్సర్లు బాదగా.. రోహిత్‌ కేవలం​ 17 ఇన్నింగ్స్‌లోనే 37 సిక్సర్లు బాదాడు. ఇక 26 ఇన్నింగ్స్‌లో 26 సిక్సర్లతో విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌‌మెన్ల జాబితాలో మాత్రం రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (534) టాప్‌లో ఉండగా.. పాకిస్తాన్ హిట్టర్ షాహిద్ అఫ్రిది (476) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (398), మెకల్లం (398)లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన రోహిత్.. అంతర్జాతీయ టీ20ల్లో తన రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును కూడా సమం చేశాడు. 22వ అర్ధ సెంచరీతో విరాట్‌ కోహ్లీతో కలిసి సమంగా నిలిచాడు. కెప్టెన్‌గా ఇద్దరూ ఆరు అర్థ సెంచరీలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa