టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏడాది ముగింపు పన్ను ప్రణాళికలో భాగంగా సుమారు 2,10,000 టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చారు. వీటి విలువ దాదాపు 100 మిలియన్ డాలర్లు ఉంటుందని ఎస్ఈసీ ఫైలింగ్లో వెల్లడైంది. అయితే ఈ విరాళం ఏ సంస్థలకు ఇచ్చారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 619 బిలియన్ డాలర్ల ఆస్తి ఉన్న మస్క్, ఈ విరాళాన్ని తన భవిష్యత్తు వ్యూహంలో భాగంగానే ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.టెస్లాలో తనకున్న వాటా సరిపోదని మస్క్ కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , రోబోటిక్స్ విభాగాల్లో టెస్లాను ముందుకు తీసుకెళ్లాలంటే తనకు కనీసం 25 శాతం ఓటింగ్ నియంత్రణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సరైన నియంత్రణ లేని పక్షంలో తనను సీఈవో పదవి నుంచి తొలగించే ప్రమాదం ఉందని, ఆ స్థితిలో రోబోటిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడం ఇష్టం లేదని అక్టోబర్లో ఆయన పేర్కొన్నారు.నవంబర్లో టెస్లా వాటాదారులు మస్క్ కోసం ఒక కొత్త వేతన ఒప్పందాన్ని ఆమోదించారు. దీని విలువ సుమారు ట్రిలియన్ డాలర్ల వరకు ఉండే అవకాశం ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో కంపెనీ నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటే, మస్క్ వాటా ప్రస్తుత 13 శాతం నుంచి దాదాపు 29 శాతానికి పెరుగుతుంది. ఇది ఆయన కోరుకుంటున్న 25 శాతం కంటే ఎక్కువే కావడం గమనార్హం.మరోవైపు ఈ వారం టెస్లా వార్షిక విక్రయాల గణాంకాలు వెలువడనున్నాయి. చైనా, ఐరోపా వంటి కీలక మార్కెట్లలో విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో, వరుసగా రెండో ఏడాది కూడా అమ్మకాలలో క్షీణత నమోదయ్యే అవకాశం ఉందని కంపెనీ స్వయంగా అంచనా వేసింది. అయినప్పటికీ, రోబోటాక్సీలు, అటానమస్ డ్రైవింగ్ రంగంలో మస్క్ విజన్ పై ఉన్న నమ్మకంతో టెస్లా షేర్ ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa