.వివాదాస్పద రామజన్మ భూమిపై వాదాపవాదాలన్నింటిని విన్న సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. శనివారం ఉదయం 10.30కి రాజ్యాంగ ధర్మాసనం తన తుది తీర్పు ఇవ్వనన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే యూపీలో కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. 4వేల పారా మిలటరీ దళాలు, బాంబ్ స్క్వాడ్స్ తరలించడంతో పాటు యూపీలో 24 గంటలు పనిచేసే మాస్టర్ కంట్రోల్రూమ్ ఏర్పాటు చేశారు. 20 తాత్కాలిక జైళ్లను యూపీ సర్కార్ ఏర్పాటు చేసింది. భద్రతను మరింత పటిష్టం చేయాలని 75 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే యూపీ అధికారులతో సుప్రీం ఛీఫ్ గొగోయ్ సమీక్ష జరిపారు.
కాగా 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ అయోధ్య కేసులో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 40రోజుల పాటు విచారణ లను విని తుది తీర్పు వెల్లడించేందుకు సిద్దమైంది. తీర్పు నేపథ్యంలో భద్రతా సంస్థలన్నీ సోషల్ మీడియాపై కూడా నిఘా పెట్టాయి. అయోధ్య తీర్పు వెలువడనున్న తరుణంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రమంతటా గురువారం నుంచే సోషల్ మీడియాపై నిఘా ఉంటుందని నిబంధనలు అమలులోకి వచ్చాయి. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్తో పాటు అన్ని సోషల్ మీడియా ఖాతాలపైనా రాష్ట్ర పోలీసులచే నిఘా కొనసాగిస్తున్నారు. కేంద్ర ఇంటలిజెన్స్ సూచనలకు అనుగుణంగా సోషల్ మీడియాపై పర్యవేక్షణ ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa