ఎపిలో మూడు రాజధానుల ఫార్మూలాకి మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తే, జనసేనాని, మెగాస్టార్ సోదరుడు పవన్ కల్యాణ్ క్యాబినేట్ నిర్ణయం తర్వాతే దీనిపై స్పందిస్తానని అన్నారు.. ఇప్పటికే పవన్ జి ఎన్ రావు కమిటీ నివేదికపై ఒక ప్రకటన విడుదల చేశారు.. మూడు రాజధానుల ప్రతిపాదనపై జనసేనాని అభ్యంతరం తెలిపారు. జీఎన్ రావు కమిటీ నివేదికతో ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొందన్నారు. అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు, నాలుగు భవనాలుగానో భావించడం లేదన్నారు. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రిమండలి నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని పవన్ తెలిపారు. కేబినెట్ నిర్ణయం తర్వాతే మా నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు జనసేనాని. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి రాజధానుల అంశంపై స్పందించారు. త్రీ కేపిటల్ ఫార్ములాకు చిరంజీవి మద్దతు తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచనను ఆయన స్వాగతించారు. అంతేకాదు మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలని చిరంజీవి కోరారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం అని చిరంజీవి స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేలా జీఎన్ రావు కమిటీ సిఫార్సులు ఉన్నాయని చిరంజీవి అభిప్రాయపడ్డారు. గతంలో అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని గుర్తు చేసిన చిరంజీవి.. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే.. ఆర్థిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయన్నారు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏపీలో.. ఇంకో లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏంటి? అని చిరంజీవి ప్రశ్నించారు. కాగా, రాజధాని రైతుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించాలని ప్రభుత్వానికి చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అలాగే త్రీ కేపిటల్ ఫార్ములాపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్దాలను నివారించేలా జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చిరంజీవి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa