అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలదే హవా కొనసాగుతోంది. ఈ త్రయం అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ లేపుతున్నారు. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టి అరుదైన ఘనతలు అందుకున్నాడు. వీరబాదుడుతో హిట్మ్యాన్గా అవతరించాడు రోహిత్ శర్మ. పదునైన యార్కర్లతో బ్యాట్స్మన్ను బెంబేలెత్తిస్తూ బుమ్రా దూసుకుపోతున్నాడు. ఇప్పడు ఈ జాబితాలోకి లోకేష్ రాహుల్ కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీలు బాదిన మూడో భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రాహుల్.. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జట్టులో చోటు కోల్పోయిన అతడు తిరిగి గాడిన పడ్డాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. రోహిత్, కోహ్లీ విఫలమయినా నేనున్నానంటూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో అదరగొడుతున్నాడు. ఇక వికెట్ కీపింగ్ కూడా చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్, కీపింగ్ ఏ పాత్ర ఇచ్చినా పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. టీ20ల్లో చెలరేగుతున్న లోకేష్ రాహుల్.. ఇప్పుడు కోహ్లీ, రోహిత్కు సాధ్యం కాని ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. 2019 నుంచి టాప్ ఆర్డర్లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసింది రాహులే. 2019లో నాలుగు (9 ఇన్నింగ్స్), 2020లో మూడు (4 ఇన్నింగ్స్)తో కలిపి మొత్తం 7 అర్ధ శతకాలు సాధించాడు. రోహిత్ నాలుగు అర్ధ శతకాలే చేశాడు. అదికూడా గతేడాది ఆడిన 14 ఇన్నింగ్సులలో. ఈ ఏడాది ఇంకా ఖాతా తెరవలేదు. కోహ్లీ కూడా కొత్త ఏడాదిలో 4 ఇన్నింగ్స్లు ఆడి ఇంకా అర్ధ శతకం నమోదు చేయలేదు. గతేడాది 10 ఇన్నింగ్సుల్లో 5 చేసాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 2019లో 12 ఇన్నింగ్సులు ఆడి ఒక్క అర్ధ శతకం నమోదు చేయలేదు. కొత్త ఏడాదిలో మాత్రం 2 ఇన్నింగ్సుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. దీంతో కోహ్లీ, రోహిత్కు సాధ్యం కాని అరుదైన రికార్డు రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ గణాంకాలతో పొట్టి క్రికెట్ ఫార్మాట్లో తనకిక తిరుగులేదని చాటుతున్నాడు. ప్రస్తుతం స్టేడియాల్లో భారత అభిమానులు 'రాహుల్.. రాహుల్' అని పొగిడేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa