ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడో టీ20 సైనీకి ఛాన్స్?

national |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2020, 07:07 PM

న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆక్లాండ్‌లో జరిగిన రెండు టీ20ల్లో టీమిండియా ఘన విజయాలు సాధించింది. బుధవారం హామిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో జరిగే మూడో టీ20ని కూడా గెలిస్తే.. ఓ పనైపోతుంది. న్యూజిలాండ్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న ఘనత దక్కుతుంది. ఇక సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేస్తే ఐసీసీ ర్యాంకుల్లో చాన్నాళ్లుగా ఐదో స్థానంలోనే ఉంటున్న టీమిండియా ఒక మెట్టు ఎక్కనుంది. తొలి రెండు టీ20ల్లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన టీమిండియా.. బౌలింగ్‌లో మాత్రం కాస్త తడబడింది. ముఖ్యంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్‌ భారీగా పరుగులు ఇచ్చాడు. తొలి టీ20లో 3 ఓవర్లలో 44 పరుగులు, రెండో టీ20లో 2 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ పొదుపుగా బౌలింగ్ చేస్తూ కివీస్ బ్యాట్స్‌మన్‌ను ఒత్తిడిలోకి నెడుతుంటే.. శార్ధూల్ మాత్రం పరుగులిచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శార్ధూల్ స్థానంలో మరో పేసర్ నవదీప్ సైనీని తీసుకోవాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ యోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. చిన్న మైదానం కాబట్టి ఈడెన్‌ పార్క్‌లో యుజువేంద్ర చాహల్‌కు వరుసగా రెండు అవకాశాలు దక్కాయి. ఇప్పుడు సెడాన్‌ పార్క్‌ పెద్ద మైదానం. బౌండరీ సరిహద్దులు సాధారణంగానే ఉంటాయి. అందుకే కుల్‌దీప్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఏదేమైనా మణికట్టు ద్వయంలో ఒక్కరికే అవకాశం దక్కనుంది. కుల్‌దీప్‌ ఫ్లైటెడ్‌ డెలివరీలు వేస్తాడు కాబట్టి ఆక్లాండ్‌లో చోటివ్వలేదు. రోహిత్ శర్మ ఇంకా తన మార్క్ చూపించలేదు. దీంతో ఓ భారీ ఇన్నింగ్స్ అతడు బాకీ ఉన్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు బాదేశాడు. హామిల్టన్ టీ20లోనూ రాహుల్ ఇదే జోరుని కొనసాగించాలని భారత్ కోరుకుంటోంది. విరాట్ కోహ్లీ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. అయితే కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోహ్లీ నుండి కూడా ఓ భారీ ఇన్నింగ్స్‌ని జట్టు ఆశిస్తోంది. నెం.4లో ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ అదరగొడుతున్నాడు. భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్ ఫలితాన్నే మార్చేస్తున్నాడు. మరో మంచి ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాకు తిరుగుండదు. నిజం చెప్పాలంటే.. మనీశ్ పాండేకి ఎక్కువ బంతులు ఆడే అవకాశం రావడం లేదు. తొలి టీ20లో 12 బంతులు ఆడిన పాండే.. రెండో టీ20లో బ్యాటింగ్‌కే రాలేదు. అయితే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. శివమ్ దూబే‌ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రవీంద్ర జడేజాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకున్నా.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటుతున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీలు బౌలింగ్ భారం మోయనున్నారు.


తుది జట్టు (అంచనా):


రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్/ కుల్‌దీప్‌ యాదవ్‌, మొహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa