న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ సోమవారం రాజ్యసభలో ప్రసంగించారు. వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత గురించి మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను మోదీ ఉటంకించారు. '''పెద్ద పెద్ద మార్కెట్ వ్యవస్థలను తీసుకురావడానికి చాలా ఇబ్బందులున్నాయి. వాటిని తొలగించి, రైతులకు లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నాం' అని మన్మోహన్ సింగ్ అన్న వ్యాఖ్యలనే నేను ఉటంకిస్తున్నాను. దానికి మీరు గర్వపడాలి.'' అని మోదీ వ్యాఖ్యానించారు. గతంలో అందరు నేతలూ వ్యవసాయ సంస్కరణలకు అనుకూలంగా మాట్లాడిన వారేనని, ఇప్పుడు మాత్రం రాజకీయాల కోసం యూటర్న్ తీసుకున్నారని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు ఏది మేలు చేకూరుస్తుందో వాటినే తీసుకొస్తున్నామని, ఇకపై కూడా తీసుకొస్తామని మోదీ స్పష్టం చేశారు.
గతంలో లాల్బహదూర్ శాస్త్రి కూడా సంస్కరణలకు అనుగుణంగా అడుగులు వేస్తుంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, అయినా సరే ఏమాత్రం వెనకడుగు వేయలేదని మోదీ గుర్తు చేశారు. అప్పుడు వామపక్షాలు కాంగ్రెస్పై అమెరికా ఏజెంట్లంటూ విరుచుకుపడేవారని, ఇప్పుడు కూడా వారే నన్ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా చట్టం వచ్చినప్పుడు, కొన్ని రోజుల తర్వాత అందులో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయని వివరించారు. సాగు చట్టాల్లోని మంచి విషయాలను రైతులకు వివరించడానికే తాము శతధా ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
రైతులు పెద్ద ఎత్తున చాలా రోజుల పాటు ఆందోళనల్లో కూర్చుండిపోయారని, వారందరూ తమ తమ ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు ఉద్యమాన్ని ముగించి, ప్రభుత్వంతో చర్చకు రావాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కనీస మద్దతు ధర ఉందని, ఇకపై కూడా ఉంటుందని, అందులో ఎలాంటి సందేహమూ లేదని మోదీ పునరుద్ఘాటించారు. సాగు చట్టాలను అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే, రైతులు అంధకారంలో మునిగిపోయే అవకాశం ఉందని మోదీ హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa