ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 11, 2021, 03:44 PM

మంగళగిరి పట్టణంలోని షరాఫ్ బజార్లో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. తన వంతుగా స్వర్ణకారుల సంక్షేమానికి 5 లక్షల రూపాయిల ఆర్థిక సహాయాన్ని లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీకి అందజేస్తున్నట్టు ప్రకటించారు. పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారని.. కానీ, ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే పెద్ద సమస్యగా మారిందని అన్నారు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత దౌర్బాగ్యమైన పరిస్థితి ఉందని, మనకి కూతవేటు దూరంలో దేశంలోనే నెంబర్ 1 ఆసుపత్రి ఎయిమ్స్ ఉందని, అయినా మనం ఇక్కడ హెల్త్ క్యాంప్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఎయిమ్స్ నిర్మాణానికి కావాల్సిన ఇసుక లేదు, కనీస మౌలిక వసతులు కల్పించలేదని అన్నారు.ఇది తాను అంటున్న మాట కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే చెప్పిన సమాధానం అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ చెత్త ఇసుక విధానం, త్రాగునీరు సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం ఇలా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోవడం వలనే ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేయలేకపోతున్నా మని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఎయిమ్స్ పూర్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. అలానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుండంతో పాటు ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ పై స్పందించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, పట్టణ పార్టీ అధ్యక్షుడు దామర్ల రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa