రాష్ట్రంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 6. 21 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, పీహెచ్సీల సిబ్బంది అందరూ సమష్టిగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రోజుకు 6 లక్షల వాక్సిన్లు ఇవ్వాలన్న లక్ష్యాన్ని బుధవారం సాధించామని, ఇకముందు కూడా అలాగే చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వాక్సిన్లు లేనందున వాటి కోసం లేఖ రాయమని అధికారులకు సూచించారు. అవసరం అనుకుంటే తాను కూడా లేఖ రాస్తానని చెప్పారు. బుధవారం కోవిడ్ నివారణ, కరోనా వాక్సిన్పై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఇంకా సీఎం జగన్ ఏమన్నారంటే. ఇవాల్టి నుంచి 104 కాల్ సెంటర్పై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. ఎవరికైనా చికిత్స, బెడ్ కావాలంటే ఆ కాల్ సెంటర్ ద్వారా సేవలందించాలి. హోం ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్ లేదా ఆస్పత్రిలో చేర్చడానికి వైద్యుల సూచనల మేరకు సేవలందించాలి. అంబులెన్సు సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సహాయంతో రోగికి వేగంగా వైద్య సేవలందించాలి. హోం ఐసొలేషన్లో కూడా వారిని ఫాలో అప్ చేయాలి. రోగి ఫోన్ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్ సమకూర్చాలి. 104 నెంబరు కోవిడ్ సేవల కోసం, 1902 నెంబరు గ్రీవెన్సుల కోసం కేటాయించండి. ఈ రెండింటినీ విస్తృతంగా ప్రచారం చేయండి. కోవిడ్కు సంబంధించిన ఏ సందేహం ఉన్నా 104కు ఫోన్ చేయాలని బాగా ప్రచారం చేయండని.. సీఎం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa