పలాష్ ముచ్చల్ .. ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపించిన పేరు ఇది. భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన పలాష్ని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడంతో దేశం యావత్తు అతడి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబర్చింది. ఎంతో ఘనంగా పెళ్లి వేడుకలకు సిద్ధమైన ఈ జంట, ఊహించని రీతిలో ఆఖరి క్షణంలో వివాహం రద్దు చేసుకోవడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై స్మృతి మందాన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఇదిలా ఉంటే, తాజాగా పలాష్ ముచ్చల్పై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. అది కూడా స్మృతి చిన్ననాటి ఫ్రెండ్ను మోసం చేసిన విషయంలో కావడం గమనార్హం.
గాయకుడు, దర్శకుడు అయిన పలాష్ ముచ్చల్పై తాజాగా కేసు నమోదయ్యింది. అతడు 40 లక్షల రూపాయలు ఎగ్గొట్టాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని పలాష్ రూ.40 లక్షలకు మోసం చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. వైభవ్ మానే అనే వ్యక్తి స్మృతి మందానకు చిన్ననాటి స్నేహితుడు. అతడు ఒక సినిమా ఫైనాన్సర్ కూడా. పలాష్ ముచ్చల్ సాంగ్లీకి వచ్చినప్పుడు, స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ మందాన.. వైభవ్ మానేకి అతణ్ని పరిచయం చేశారని సమాచారం.
ఈ క్రమంలో పలాష్ ముచ్చల్ తాను 'నజరియా' అనే సినిమా తీస్తున్నానని, దానిలో పెట్టుబడి పెట్టాల్సిందిగా వైభవ్ మానేను కోరినట్లు తెలిపారు. సినిమాను త్వరగా పూర్తి చేసి OTT ప్లాట్ఫామ్లో విడుదల చేస్తానని, పెట్టిన డబ్బులు కూడా వెంటనే తిరిగి వస్తాయని పలాష్ హామీ ఇచ్చారని మానే తన ఫిర్యాదులో వెల్లడించారు.
ఈ మాటలు నమ్మి, మానే సినిమా నిర్మాణానికి మొత్తం 40 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆయన ఈ డబ్బును విడతల వారీగా నగదు రూపంలోనూ, గూగుల్ పే ద్వారా పలాష్కు అందించారు. ఈ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించారు.
అయితే, సినిమా ఇంకా పూర్తి కాలేదు. దీంతో తన డబ్బులు తిరిగి ఇవ్వమని వైభవ్ మానే పలాష్ని అడిగారు. అందుకు పలాష్ ముందుగా డబ్బు ఇస్తానని చెప్పారు. కానీ తర్వాత ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేసి, చివరికి నంబర్ను బ్లాక్ చేశారని మానే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చాలా కాలం పలాష్ని డబ్బుల గురించి అడిగిన మానే.. అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. పలాష్ తన వద్ద నుంచి రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశారని సాంగ్లీ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన డబ్బును తనకు ఇప్పించాలని పోలీసులను కోరారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారి మాట్లాడుతూ.. పలాష్ ముచ్చల్పై తమకు ఫిర్యాదు అందిందని, బాధితుడు ఇచ్చిన పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తదుపరి విచారణ జరుగుతోందని వెల్లడించారు. స్మృతి మందాన ఆఖరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకోవడంతో పలాష్ తీరు అనుమానాలకు తావిచ్చింది. ఆయన క్యారెక్టర్ గురించి చెడుగా ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు చీటింగ్ కేసు కేసు నమోదు కావడంతో పలాష్ తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. వివాహం రద్దు చేసుకున్న తర్వాత స్మృతి మందాన తన ఆట మీద దృష్టి సారించారు. పలాష్ ముచ్చల్ సైతం తన తదుపరి సినిమా దర్శకత్వ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో నటుడు శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్ర పోషించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa