ఏపీ సీఎం జగన్ నాడు-నేడు (పాఠశాల విద్యాశాఖ)పై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నాడు-నేడు మనబడి మొదటిదశలో 15,715 స్కూళ్లలో చేపట్టిన పనుల పురోగతిని సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా పాఠశాలల గోడలకు వేసినట్లు, బిల్డింగ్ పై కూడా పెయింటింగ్స్ వేయాలని ఆదేశించారు. అన్ని పనులు మే చివరి నాటికి పూర్తి కావాలని, పనుల నాణ్యతలో ఎక్కడా లోపం ఉండకూడదని అన్నారు. ఇంగ్లీష్ మీడియంలో బోధన సజావుగా జరిగేలా టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, అప్పుడే వారు ఏ ఇబ్బంది లేకుండా పాఠాలు భోధించగలుగుతారని అన్నారు. విద్యార్థులు స్కూళ్లకు వచ్చే నాటికే విద్యా కానుక కూడా సిద్ధం కావాలని, ఈసారి కిట్లలో ఇంగ్లీష్ డిక్షనరీ కూడా తప్పనిసరిగా ఉండాలని, జూలైలో స్కూళ్లు తెరవగానే, నాడు-నేడు మనబడి రెండో దశ పనులు మొదలు కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. నిన్న కేరళలో పదో తరగతి పరీక్షలు పూర్తి చేశారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్రం ఏ విధానాన్ని ప్రకటించలేదు. నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దాంతో రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, మరి కొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని అన్నారు.
పరీక్ష పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులు మాత్రమే ఇస్తున్నాయని, అదే పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయని అన్నారు. మంచి మార్కులు లేకపోతే మంచి కాలేజీల్లో వారికి సీట్లు ఎలా వస్తాయి.. పరీక్ష రాసిన వారికి 70 శాతం పైగా మార్కులు వస్తే, సీట్లు వారికే వస్తాయి కదా. కేవలం పాస్ మార్కులతో బయటకి వెళ్తే విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఏమిటి అని సీఎం జగన్ ప్రశ్నించారు. విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa