ప్రస్తుతం చలి వణికిస్తోంది. నీటిని ముట్టుకుందామన్న ఆలోచన వచ్చిన చలి పెట్టేస్తోంది. సాధారణంగా ఎండాకాలంలో దాహం ఎక్కువగా వేస్తుంది కాబట్టి నీరు తాగుతుంటాం. కానీ శీతాకాలంలో చలి వల్ల దాహం తక్కువగా అనిపిస్తుంది. పెద్దలే కాదు, చిన్న పిల్లలు కూడా ఈ సమయంలో నీరు తాగడానికి ఆసక్తి చూపరు. అయితే వాతావరణం ఎలా ఉన్నా పిల్లల శరీరానికి తగినంత తేమ అందడం చాలా అవసరమని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ అర్పిత్ గుప్తా చెబుతున్నారు. పిల్లల వయస్సును బట్టి వారు రోజూ ఎంత పరిమాణంలో నీరు తీసుకోవాలో ఆయన వివరించారు.
ఆరు నెలల వరకు తల్లి పాలే ఆధారం
నవజాత శిశువుల నుంచి ఆరు నెలల వయస్సు వచ్చే వరకు పిల్లలకు విడిగా నీరు ఇవ్వవలసిన అవసరం లేదు. వారికి కావాల్సిన పోషకాలు, తేమ కేవలం తల్లి పాలు లేదా డాక్టర్ సూచించిన ఫార్ములా మిల్క్ ద్వారానే అందుతాయి. ఆరు నెలల తర్వాత ఘన ఆహారం ప్రారంభించినప్పుడే నీటిని పరిచయం చేయాలి.
వయస్సు రీత్యా నీటి అవసరాలు
డాక్టర్ అర్పిత్ గుప్తా చెబుతున్నదాని ప్రకారం.. పిల్లల వయస్సును బట్టి నీటి పరిమాణం ఉండాలి.
6 నుంచి 9 నెలల వయసు: ఈ దశలో ఉన్న శిశువులకు రోజుకు గరిష్ఠంగా 120 ఎంఎల్ వరకు నీరు సరిపోతుంది.
9 నుంచి 12 నెలల వయసు: పది నెలల నుంచి ఏడాది లోపు పిల్లలకు రోజుకు సుమారు 240 ఎంఎల్ వరకు నీటిని అందించవచ్చు.
ఒక సంవత్సరం దాటితే: ఏడాది పైబడిన పిల్లలకు రోజుకు 240 ఎంఎల్ నుంచి 750 ఎంఎల్ వరకు నీటి అవసరం ఉంటుంది.
నీరు తాగించే సరైన పద్ధతి
చిన్న పిల్లలకు నీరు అందించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని డాక్టర్ అర్పిత్ గుప్తా సూచించారు. ముఖ్యంగా 6 నుండి 12 నెలల వయస్సు గల పసివారికి ప్రతి పూట ఘన ఆహారం ఇచ్చే సమయంలో సుమారు 50 ఎంఎల్ నీటిని ఓపెన్ కప్పులో పోసి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల చిన్నప్పటి నుండే గ్లాసు లేదా కప్పుతో సొంతంగా తాగడం అలవాటవుతుంది. ఇది వారి దవడ కండరాల ఎదుగుదలకు సైతం తోడ్పడుతుంది.
ఏడాది పైబడిన పిల్లల సంరక్షణ
ఒక సంవత్సరం దాటిన పిల్లలకు రోజంతా తగినంత తేమ అందేలా చూడాలి. వారికి రోజుకు సుమారు 6 నుండి 8 సార్లు నీరు తాగించే ప్రయత్నం చేయాలి.
ప్రతిసారి దాదాపు 100 నుండి 150 ఎంఎల్ పరిమాణంలో నీటిని ఆఫర్ చేస్తూ ఉండాలి. శీతాకాలంలో వాతావరణం పొడిగా ఉండటం వల్ల పిల్లల చర్మం, గొంతు తేమ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు అడగకపోయినా మధ్యమధ్యలో నీటిని ఇస్తూ ఉండటం మంచిది.
శీతాకాలంలో జాగ్రత్తలు
చలికాలంలో పిల్లలకు చల్లని నీరు ఇవ్వకుండా కొద్దిగా గోరువెచ్చని నీరు ఇవ్వడం ఉత్తమం. ఇది వారి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. డాక్టర్ అర్పిత్ గుప్తా చెప్పిన ఈ లెక్కల్ని పాటిస్తూ మీ పిల్లలను డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోండి. సరైన మోతాదులో నీరు అందడం వల్ల పిల్లలు చురుగ్గా ఉండటమే కాకుండా వారిలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa