ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరీరంలో ఏ సమస్యకు ఏ పండు తినాలో తెలుసా

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Jan 10, 2026, 11:54 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని కూడా చెబుతుంటారు. ఇక, జ్యూసులతో పోలీస్తే పండ్లు తినడం ఆరోగ్యకరమైన ఎంపిక. పండ్లు శరీరానికి అవసరమైన పోషకాల్ని అందించడమే కాకుండా కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గేందుకు సాయపడతాయి.


అంతేకాకుండా పండ్లు అనేక ఆరోగ్య సమస్యల్ని తగ్గించడంలో సాయపడతాయి. మలబద్ధకం తగ్గడానికి వివిధ రకాల పండ్లు తినమని చాలా మంది సలహా ఇచ్చి ఉంటారు. ఒక మలబద్ధకమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలకు పండ్లు తినడం మంచి ఆప్షన్. ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఖుషి చబ్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏ సమస్యకు ఏ పండు తినాలో సలహా ఇచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


గ్యాస్ట్రిక్ సమస్యలకు సపోటా


చాలా మంది సపోటాని ఇష్టంగా తింటుంటారు. సపోటా పండు చాలా తియ్యగా ఉంటుంది. సపోటాలో విటమిన్లు ఎ, సి, ఈ, కె, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇక, సపోటాలో అధికంగా టానిన్లు ఉంటాయి. ఇవి సహజ శోథ నిరోధకంగా పనిచేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరంవంటి సమస్యలతో బాధపడేవారికి సపోటా మంచి పండు అని న్యూట్రిషనిస్ట్ ఖుషీ చబ్రా వివరిస్తున్నారు.


రోగనిరోధక శక్తికి నారింజ


​నారింజ పండ్లు పులుపు, తీపి రుచితో భలే ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా చర్మ కాంతిని పెంచుతుంది. ఎందుకంటే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా రక్తంలో తెల్ల కణాల్ని పెంచుతుంది. దీంతో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి కూడా మంచిది.


మలబద్ధకానికి రామఫలం లేదా పెర్సిమోన్ 


రాంఫలాన్ని ఎర్ర సీతాఫలం అంటారు. ఇది సీతాఫలం కుటుంబానికి చెందిన పండు. ఇది మలబద్ధకంతో బాధపడుతున్నవారికి బెస్ట్ ఆప్షన్ అంటున్నారు న్యూట్రిషనిస్ట్. రాంఫలం లేదా పెర్సిమోన్‌లో కరిగే ఫైబర్ ఉంటుంది. దీనిని పెక్టిన్ అని కూడా పిలుస్తారు. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనాన్ని అందించడంలో సాయపడుతుంది. ఇది పేగుల్లోని మలాన్ని మృదువుగా చేస్తుంది. రాంఫలం సహజ భేదిమందుగా పనిచేస్తుంది.


గట్ ఆరోగ్యానికి సీతాఫలం


ఈ రోజుల్లో మంచి గట్ ఆరోగ్యం ఎంతో కీలకం. పేగులు ఆరోగ్యంగా ఉంటే ఏ సమస్యలు రావు. గట్ ఆరోగ్యం కోసం సీతాఫలం తినాలని న్యూట్రిషనిస్ట్ చెబుతున్నారు. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సరిగ్గా పనిచేయడానికి సాయపడుతుంది. అంతేకాకుండా సీతాఫలం గుండె ఆరోగ్యానికి మద్దతిస్తుంది. అయితే, డయాబెటిక్ పేషంట్లు డాక్టర్ సలహా మేరకు తినాలి.


జుట్టు, చర్మానికి మేలు చేసే ఉసిరి


ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయ పనితీరును సజావుగా చేస్తుంది. అంతేకాకుండా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి మీరు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే, ప్రతిరోజూ ఒక ఉసిరి తినాలని న్యూట్రిషనిస్ట్ సిఫార్స్ చేస్తున్నారు.


శక్తి స్థాయిలకు అరటిపండు


ఎవరైనా కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నా.. లేదా శక్తి స్థాయిలు లేకున్నా వారికి అరటిపండు మంచి ఆప్షన్. అరటిపండ్లలో అధిక పొటాషియం కంటెంట్ ఉంటుంది. ఇది శరీరం నుంచి అదనపు సోడియంను బయటకు పంపడంలో సాయపడుతుంది. ఇది నీరు నిలుపుదల, ఉబ్బరానికి కారణమవుతుంది. జిమ్‌కి వెళ్లాలనుకునేవారికి అరటిపండు మంచి ఆప్షన్. ఇది తక్షణ శక్తిని అందించడంలో సాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa