చిత్తూరు: తనను, తన భార్యను అవమానకరంగా మాట్లాడారన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచవీటివారి పల్లి పంచాయతీ గుండ్లబురుజు గ్రామంలో జరిగింది. మృతుడు సి. ప్రభాకర్ (45) భార్య శారద ఘటనపై స్థానిక పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. స్థానిక ఎస్ఐ ఫాతిమా తెలిపిన మేరకు వివరాల మేరకు. బుధవారం గుండ్లబురుజు గ్రామానికి చెందిన సి. ప్రభాకర్ భార్య శారద, మరో మహిళ శోభతో కలిసి గ్రామ సమీపంలోని పొలాల వద్దకు బహిర్భూమికి వెళ్లారు. అదే గ్రామానికి చెందిన నిందితులు కె రామమూర్తి, అతని భార్య రెడ్డమ్మ, తల్లి గంగులమ్మ కలసి శారద, శోభ ను తమ పొలం వద్దకు ఎందుకు వచ్చారంటూ దుర్భాషలాడారు. జరిగిన విషయం శారద తన భర్త ప్రభాకర్ తో చెప్పింది. దీంతో నిందితుడు రామమూర్తి, ప్రభాకర్ లు గొడవ పడ్డారు. అనంతరం గొర్రెలను మేపేందుకు ప్రభాకర్ పొలం వద్దకు వెళ్లగా, రామమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి గొడవకు దిగి అవమానకరంగా మాట్లాడారు. దీంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్ రాత్రి 8 గంటల సమయంలో తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. బాధితురాలు శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa