విజయవాడ విమానాశ్రయంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. వారణాసి విమానాశ్రయంలో కల్పించిన విధంగా కోల్డ్ స్టోరేజి, కస్టమ్స్ క్లియరెన్స్, ఫైటోశానిటరీ క్లియరెన్స్ వంటి సదుపాయాలు విజయవాడలో కల్పించాలని నాని కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కేశినేని నాని ఇలా పేర్కొన్నారు...
కృష్ణా జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. 2020-21లో 14 లక్షల మెట్రిక్ టన్నుల పండ్ల ఉత్పత్తితో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పక్కనే ఉన్న గుంటూరు జిల్లా 6 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మసాల దినుసుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. రెండు జిల్లాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మామిడి, మిర్చి ఉత్పత్తికి ప్రసిద్ధిచెందాయని ఆయన తన లేఖలో వివరించారు. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ పాలసీ ప్రకారం ఏపీ నుంచి మధ్య ఆసియా, యూరప్ దేశాలతో పాటు, యూకే, న్యూజీలాండ్కు 109 మెట్రిక్ టన్నుల మామిడి పండ్ల ఎగుమతి జరిగిందని ఎంపీ వివరించారు. దేశ రాజధాని ఢిల్లీకి కూడా కృష్ణా జిల్లా నుంచి 4వేల మెట్రిక్ టన్నుల రవాణా జరిగిందని…. అలాగే దేశంలోనే అత్యధిక మత్స్య సంపద ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కి పేరు ఉందన్నారు. ఆక్వా రంగంలో కృష్ణా జిల్లా దేశంలో మొదటి స్థానంలో ఉందని చేపల చెరువులు, రొయ్యల చెరువుల విస్తీర్ణం 68వేల హెక్టార్లలో ఉందని ఎంపీ తెలిపారు. జిల్లా నుంచి 13,83,110 టన్నుల మత్స్య సంపద ఎగుమతి జరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా) విజయవాడ విమానాశ్రయంలో ఎగుమతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆయన కేంద్ర వాణిజ్యశాఖమంత్రి పీయూష్ గోయల్ ను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa