గుంటూరు: ప్రభుత్వ నిబంధనలు పాటించని సినిమా హాళ్ళపై చర్యలు తీసుకోవడంతో పాటుగా, ప్రదర్శనలు నిలిపి వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక జిటి రోడ్డులో ఉన్న సినీ ప్రైమ్ సినిమా హాలును జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మికoగా తనిఖీ చేశారు. ప్రభుత్వ జిఒఎంఎస్ నెంబరు 35 ప్రకారం నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అనే అంశంపై థియేటర్ నిర్వహకులను ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసిన విధానాన్ని పరిశీలించారు. థియేటర్ నడిపేందుకు అవసరమైన అనుమతుల పత్రాలను పరిశీలన చేశారు. థియేటర్ మొత్తం ఎంత వైశాల్యంలో ఉంది, హాలు నిర్మాణ అనుమతులు, నిర్ధిష్ట కాలపరిమితి, పార్కింగ్ ధరలు, క్యాంటీన్ ధరలు, థియేటర్ పరిసరాల పరిశుభ్ర వాతావరణం, త్రాగునీరు, పారిశుధ్ధ్యం, మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ అనుమతులు, ఆర్అండ్ బి నుంచి అనుమతులు, మున్సిపల్ అనుమతులు తదితర పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులు నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ టిక్కెట్లు అమ్మకం ధరలు, సీటింగ్ పరిమితి తదితర అంశాలను యాజమాన్యం నుంచి అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా ధరలు, నాణ్యత ప్రమాణాలు పరిశీలించారు. కార్యక్రమంలో గుంటూరు డివిజన్ ఆర్. డి. ఒ భాస్కర్ రెడ్డి, పశ్చిమ తహశీల్ధార్ వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి విజయలక్ష్మీ, అగ్నిమాపక దళ అధికారి టి. శ్రీనివాసరెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి గౌస్ మొహిద్ధీన్, మున్సిపల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరావు, ఆర్అండ్ బి డిఈఈ నాగిరెడ్డి, డిప్యూటి సిటీ ప్లానర్ హిమబిందు తదితర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa