జిల్లాలో కొవిడ్ ను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ ప్రొటోకాల్ ను విధిగా పాటించాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో.. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ "స్పందన" కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు తో పాటు జేసిలు ఎం.గౌతమి (రెవెన్యూ), సీఎం సాయికాంత్ వర్మ (అభివృద్ధి), ధ్యానచంద్ర (హౌసింగ్), డిఆర్వో మాలోల , జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడి పద్మజ లు హాజరయ్యారు. స్పందన అర్జీల స్వీకరణకు ముందు జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు మాట్లాడుతూ. రాష్ట్రంలో కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని.. కోవిడ్ మూడో దశ (ఒమిక్రాన్ వేరియంట్) వేగంగా విజృంభిస్తున్న తరుణంలో కఠిన అంక్షలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగులుగా మనమందరం కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ జిల్లా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అన్నారు. జిల్లా అధికారులు, వారి సిబ్బంది, ప్రజలు.. అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ ... తరచుగా సానిటైజర్ తో కానీ సబ్బుతో కానీ చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. జిల్లా అధికారులు, వారి సిబ్బంది తమ తమ కార్యాలయాల్లో కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని .. మాస్కు ధరించని జిల్లా అధికారులకు రూ.5వేలు ఫైన్ వేస్తామన్నారు. అలాగే మాస్క్ ధరించని ఉద్యోగులు, సిబ్బందికి సంభదిత శాఖాధికారులు నోటీసు ఇచ్చి రూ.1000లు ఫైన్ విధించాలన్నారు. ఇంటి నుండి బయటకు వచ్చే ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని లేకపోతే రూ.100 లు ఫైన్ వేయడం జరుగుతుందన్నారు. కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించడం ద్వారా తమతో పాటు ఇతరులను కూడా కొవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చునన్నారు. కొవిడ్ నిర్మూలనకు మనమందరం కలసి కట్టుగా కృషిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డ్వామా, ఏపిఎంఐపి, మెప్మా పీడీలు యధుభూషన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, రామమోహన్ రెడ్డి, డిఎంహెచ్ఓ నాగరాజు, సిపిఓ వెంకటరావు, స్టెప్ సీఈఓ రామచంద్రా రెడ్డి, ఎస్ సి కార్పొరేషన్ ఈడి వెంకట సుబ్బయ్య, డీఈఓ శైలజ, ఆర్ & బి ఎస్ ఈ మహేశ్వర రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa