ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలు తిరుగులేని ముద్ర వేశారు. మన దేశంలో హైదరాబాద్ మాత్రమే కాకుండా.. బెంగళూరు, పుణె సహా అమెరికాలోని టెక్సాస్ వరకు ఇలా ప్రతిచోటా తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సత్తా చాటుతున్నారు. ఐటీ రాజధానిగా పిలుచుకునే బెంగళూరులో 15-20 శాతం వరకు ఐటీ ఉద్యోగులు తెలుగువారే ఉంటారని అంచనా. పలు కంపెనీల్లో ఇక్కడ తెలుగు ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా అమెరికాలోనూ తెలుగోళ్లు బాగానే ఉంటారు. ఇక్కడ అత్యధికంగా డల్లాస్లో (టెక్సాస్ రాష్ట్రం) ఉంటారని చెప్పొచ్చు. అక్కడ జరిగే పండగలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తుంటే.. అది అమెరికానా అమరావతా అన్న సందేహం కలగకమానదు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు వారి ఆధిపత్యం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా హాస్పాస్పద వీడియోతో.
ప్రముఖ స్టాండప్ కమెడియన్.. కర్ణాటక మంగళూరుకు చెందిన శ్రద్ధా జైన్ (ఐయ్యో శ్రద్ధా).. క్వాల్కామ్ ఈవెంట్లో చేసిన స్టాండప్ కామెడీ క్లిప్ ట్విట్టర్లో వైరల్ అవుతోంది. ముఖ్యంగా.. 'తెలుగు వాళ్లందరినీ ఒకే టీమ్లో పెట్టకండి.. వాళ్లు కంపెనీనే టేకోవర్ చేస్తారు.' అంటూ ఆమె చేసిన జోక్ గురించే అంతా చర్చ నడుస్తోంది.
ఐటీ రంగంలోని పరిస్థితులపై ఆమె చేసే వ్యంగ్యాస్త్రాలు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇప్పుడు కూడా ఆమె ఐటీ కంపెనీల్లో డైవర్సిటీ గురించి మాట్లాడుతూ తెలుగు ప్రజల గురించి వ్యాఖ్యలు చేశారు. 'హెచ్ఆర్లు ఒకే విషయంలో చాాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకే టీంలో అందరూ తెలుగు వారిని పెట్టకండి. ఒకవేళ అలా చేస్తే.. తక్కువ సమయంలోనే వారు ఆ కంపెనీని ఆక్రమించేస్తారు.' అని జోక్ చేశారు.
అక్కడితే ఆగలేదు. అమెరికాలో తెలుగు వారి గురించి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ముడిపెడుతూ కామెడీ చేశారు. అమెరికాలో తెలుగు వారి ప్రాబల్యం గురించి మాట్లాడారు. 'డల్లాస్ మొత్తం తెలుగు రాజ్యం అయిపోతుంది. ట్రంప్ ఏమో గ్రీన్ల్యాండ్ను ఆక్రమించాలనుకుంటున్నారు. కానీ తెలుగు వారు అప్పటికే టెక్సాస్ను ఆక్రమించేశారు. ఇప్పుడు డల్లాస్ చూస్తే అది అమెరికాలో ఉందో లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉందో అర్థం కావడం లేదు. అక్కడ స్కూళ్లలో తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అవుతుంది. ట్రంప్ వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.' అని ఆమె అనడంతో హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది.
@Sanatan_kannada అనే ఒక యూజర్ ఈ వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. 73 వేలకుపైగా వ్యూస్, 1500కుపైగా లైక్స్ వచ్చాయి. ఇక్కడ నెటిజెన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అంటూ చాలా మంది తెలుగు వారు తమ ప్రతిభను చాటుకుంటున్నందుకు గర్వపడుతున్నారు. మరికొందరు మాత్రం ఐటీ మేనేజర్లు కేవలం తమ ప్రాంతం వారికే ప్రాధాన్యం ఇస్తారని విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరు దీనికి కౌంటర్గా 'తెలుగు మేనేజర్లు అసలు తెలుగు వారికే సహాయం చేయరు. అదంతా భ్రమే' అంటూ రిప్లై ఇస్తున్నారు.
ఇదే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో కూడా తెలుగు మూలాలు ఉన్న నేతల ప్రభావంపై నెటిజెన్లు ఆసక్తికర చర్చ నడుపుతున్నారు. 'కంపెనీలను వదిలిపెట్టండి.. తమిళనాడులో దశాబ్దాల నుంచి తెలుగు ప్రజలు సీఎంలుగా చేశారు.' అని ఒకరు కామెంట్ చేశారు. ఇంకొకరు.. 'ట్రంప్ కష్టపడి గ్రీన్ల్యాండ్ను సొంతం చేసుకుంటే.. అక్కడ తెలుగు ప్రజల్ని నింపుతాం' కామెంట్లు చేస్తున్నారు. శ్రద్ధా చేసింది కామెడీకే అయినా.. అంతర్జాతీయ టెక్ రంగంలో తెలుగు కమ్యూనిటీ ఎంతలా పాతుకుపోయిందో మరోసారి గుర్తుచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa