మన దేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే పాత లేదా కొత్త పన్ను విధానాల ఆధారంగా అందులోకి టాక్స్ శ్లాబుల్ని బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొన్నాళ్ల వరకు ఒకటే పన్ను విధానం ఉండగా.. 2020 సమయంలో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. అప్పటి వరకు ఉన్న పన్ను విధానాన్ని తొలగించకుండా మరో టాక్స్ రిజిమేను తీసుకొచ్చింది. ఇక ప్రతిసారీ బడ్జెట్లో ఈ కొత్త పన్ను విధానంలో మోదీ సర్కార్ మార్పులు చేస్తూనే ఉంది. ఇటీవలి కాలంలో కొత్త పన్ను విధానాన్ని మరింత సరళంగా మారుస్తూ.. ఇందులోనే టాక్స్ రేట్లను తగ్గించింది. దీంట్లోనే ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇదే సమయంలో పాత పన్ను విధానంలో మాత్రం ఏ మార్పులు చేయట్లేదు. త్వరలో పాత పన్ను విధానాన్ని దశల వారీగా తొలగించనున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరికొద్దిరోజుల్లో 2026, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అసలు ఈ కొత్త పన్ను విధానాన్ని ఎప్పుడు కేంద్రం తీసుకొచ్చింది.. ఇన్నేళ్లలో ఇందులో ఏ మార్పులు చేసిందనే వివరాలు చూద్దాం.
>> తొలుత 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మినహాయింపుల్ని పూర్తిగా తొలగిస్తూ ఐటీ రిటర్న్స్ సరళంగా ఫైల్ చేసేందుకు ముందుగా దీన్ని ఆప్షనల్గానే తీసుకొచ్చారు. తర్వాత డిఫాల్ట్గా మార్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమయంలో అంటే గతేడాది రూ. 12 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది కేంద్రం. ఇది ఈ లోపు ఆదాయం ఉన్న టాక్స్ పేయర్లు ఊపిరిపీల్చుకున్నారు. దీంతో కొత్త పన్ను విధానంవైపు చాలా మంది మొగ్గుచూపారు.
ఈ సమయంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ రిబేటుతో కలిపి సున్నా టాక్స్ ఉండగా.. రూ. 5-7.5 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం, 7.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం, రూ. 12.5 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం, 15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం, ఆపైన 30 శాతం పన్ను వర్తిస్తుందని నిర్మలమ్మ చెప్పారు. ఇక్కడ పన్ను మినహాయింపుల్ని పూర్తిగా తొలగించారు.
2021-22, 2022-23 బడ్జెట్ సమయంలో ఆదాయపు పన్నుకు సంబంధించి ఎలాంటి మార్పుల్ని చేయలేదు. తర్వాత 2023-24 బడ్జెట్లోనే కొత్త పన్ను విధానాన్ని డీఫాల్ట్గా చేశారు. ఇక్కడ శ్లాబు రేట్లను కూడా సవరించారు. రూ. 0-3 లక్షల వరకు సున్నా టాక్స్, 6 లక్షల వరకు 5 శాతం, 9 లక్షల వరకు 10 శాతం, 12 లక్షల వరకు 15 శాతం, 15 లక్షల వరకు 20 శాతం, 15 లక్షలు దాటితే 30 శాతం టాక్స్ రేట్లను ప్రకటించింది. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగా చేశారు. సెక్షన్ 87A కింద టాక్స్ రిబేటును కూడా పెంచి రూ. 7 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
మళ్లీ 2024-25 బడ్జెట్లో విప్లవాత్మక మార్పుల్ని ప్రకటించింది. ఇక్కడ రూ. 12 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను కట్టక్కర్లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే రూ. 12.75 లక్షల వరకు వేతన జీవులకు టాక్స్ పడదని పేర్కొన్నారు. ఇక్కడ టాక్స్ రిబేటును రూ. 60 వేలకు పెంచారు. ఇంకా పన్ను శ్లాబుల్ని కూడా సవరించారు. రూ. 4 లక్షల వరకు ఆదాయంపై సున్నా టాక్స్, 8 లక్షల వరకు 5 శాతం, 12 లక్షల వరకు 10 శాతం, 16 లక్షల వరకు 15 శాతం, 20 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం, 24 లక్షల వరకు అయితే 25 శాతం, ఆపైన ఆదాయంపై 30 శాతం పన్ను రేట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
మరి ఈసారి కేంద్రం కొత్త పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి. ఈసారి పాత పన్ను విధానంలో ఏమైనా మార్పులు ప్రకటిస్తుందా లేదా దాన్ని రద్దు చేస్తుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొందరు కొత్త పన్ను విధానంలో కూడా పన్ను మినహాయింపుల్ని వర్తింపజేయాలని కోరుతున్నారు. ఇంకొందరు టాక్స్ రిబేట్ పెంచి.. రూ. 15 లక్షల వరకు ఆదాయంపై టాక్స్ ఉండకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై ఒక క్లారిటీ రావాలంటే.. ఫిబ్రవరి 1 వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa