ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైయస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్దం:పెద్దిరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 06:50 PM

జనవరి ఒకటో తేదీ నుంచి అయిదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి నెల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాలను రూ.2250 నుంచి రూ.2500 రూపాయలకు పెంచి చెల్లించబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సీఎం శ్రీ  వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని, జనవరి 1వ తేదీన గుంటూరు జిల్లా  ప్రత్తిపాడులో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు స్వయంగా పాల్గొని పంపిణీని ప్రారంభిస్తారని తెలిపారు.  


వైయస్ఆర్సిపి అధికారంలోకి వస్తే అవ్వాతాతలకు చెల్లిస్తున్న పెన్షన్ మొత్తాలను పెంచుతామని వైయస్ జగన్ గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు.  దాని ప్రకారం సీఎంగా శ్రీ వైయస్ జగన్ గారు అధికారం చేపట్టిన తొలిరోజే తొలి సంతకం పెన్షన్ల పెంపుదలపైన చేశారని గుర్తు చేశారు.  పెన్షన్ల మొత్తాన్ని రూ.3వేల వరకు పెంచుతామన్న మాటకు కట్టుబడి పింఛన్ మొత్తాలను పెంచుతున్నారు.  5 రోజుల పాటు రాష్ట్రంలో ఒక పండుగలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.  గుంటూరుజిల్లా ప్రత్తిపాడులో జరిగే కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్ జగన్ పాల్గొని పెన్షన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అలాగే అన్ని జిల్లాల్లోనూ ఇన్చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అవుతారు.


 జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం.  ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.1570.60 కోట్ల రూపాయలను విడుదల చేసింది.  జనవరి నెలలో కొత్తగా 1.41 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేసింది.  వీరికి కూడా నెల ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తాలతో పెన్షన్ చెల్లింపులు చేస్తాం.  దేశంలోనే సామాజిక పెన్షన్ల కింద లబ్దిదారులకు ఎక్కువ మొత్తాలను చెల్లిస్తున్నది మన రాష్ట్రమే.  ప్రతినెలా సుమారు 61 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నాం. - ఇందుకు ప్రతినెలా సుమారు రూ.1450 కోట్లుకు పైగా పెన్షన్ల కోసం కేటాయిస్తున్నాం. ప్రతి ఏటా దాదాపు రూ.18వేల కోట్ల మేరకు పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.  జనవరి నుంచి పెరిగిన పెన్షన్లతో ప్రతిఏటా పెన్షన్ల కోసం చేసే ఖర్చు రూ.20వేల కోట్లకు చేరుతుంది.  శ్రీ వైయస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు పెన్షన్ల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం దాదాపు రూ.45వేల కోట్లు.  మొత్తం 24 కేటగిరిల కింద పెన్షన్లను ప్రతినెలా 1వ తేదీనే లబ్ధిదారుల చేతికే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa