ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలమైన రాజకీయ శక్తిగా సిపిఎం:వి.శ్రీనివాసరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 06:53 PM

రాష్ట్రంలో వైసిపి, టిడిపి కళ్లు తెరవాలిరాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించడంతోపాటు బలమైన రాజకీయ శక్తిగా సిపిఎంను తీర్చిదిద్దాలని రాష్ట్ర మాహాసభ నిర్ణయించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని నిలువరించకపోతే రాష్ట్రాన్ని కూడా మూసేస్తుందని మండిపడ్డారు. గురువారం ఉదయం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, మంతెన సీతారాం, బి.తులసీదాస్‌, పి.జమలయ్య, వి.వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర 26వ మహాసభలు తాడేపల్లిలో మూడు రోజులపాటు జరిగాయని, వీటిల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ప్రజలస్థితి, సమస్యలు, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వాటిపట్ల పార్టీ వైఖరి ఎలా ఉండాలనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం రాజకీయ తీర్మానాన్ని ఆమోదించామని వివరించారు. హోదా కోసం ఏడేళ్ల నుండి పోరాడుతుంటే ఇవ్వకపోగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు భారాలు వేస్తోందని, వీటిని గతంలో అధికారంలో ఉన్న టిడిపి, ప్రస్తుత వైసిపి అమలు చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా భారాలు మోపుతున్నాయని అన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ప్రజాపోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల ప్రజలపై భారాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా రైతులు, యువతకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బిజెపి నాయకులు ఎందుకు మాట తప్పారో చెప్పలేదన్నారు. కనీసం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కూడా తెలుపలేదని మండిపడ్డారు. ఇన్నేళ్లలో రాష్ట్రంలో ఒక్క కేంద్ర సంస్థను కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని కోరుతున్నా అతీగతి లేదని, అదే సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని, ఎవరూ కొనకపోతే మూసేస్తామని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ‘చీపు’ రాజకీయాలు చేస్తున్న బిజెపి నాయకులు ఎక్కువ కాలం మోసం చేయలేరని, తిరగబడే రోజు వస్తుందని ప్రజలే ముకుతాడు వేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసిపి, టిడిపి కళ్లు తెరిచి బిజెపి నైజం తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్తపన్ను, విద్యుత్‌ భారాలు మోపుతోందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కార్మిక, రైతాంగ     ఉద్యమాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వారందరినీ కలుపుకుని బలమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తామని వివరించారు. సిపిఎంను ప్రజాబాహుళ్యంతో కూడిన బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ఉద్యమాలకు బలమైన కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని వివరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa