ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్తకొట్టాడు...దేశాన్ని రాణించాడు

national |  Suryaa Desk  | Published : Thu, Dec 30, 2021, 11:46 PM

క్రికెట్ జట్టులో పదకొండు మంది సభ్యులున్నా ప్రతిభా వంతమైన ఆట తీరు క్రీడాకారుడివల్లే ఏ జట్టు అయిన గెలుస్తుంది. ఇపుడు అలాంటి ప్రతిభనే ప్రదర్శించాడు అండర్-19 ఆసియా కప్ టోర్నీలో తెలుగు కుర్రాడు షేక్ రషీద్(108 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 90 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యువ భారత్ 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యశ్‌ధుల్ నేతృత్వంలోని టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగులు చేసింది. షేక్ రషీద్ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యశ్‌ దుల్(26), విక్కీ(28 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రకీబుల్ హసన్ మూడు వికెట్లు తీయగా.. తంజీమ్, నైముర్, మెహరోబ్, అరిఫుల్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 38.2 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. అరిఫుల్ ఇస్లామ్(42), మహ్‌ఫిజుల్ ఇస్లామ్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రాజవర్ధన్ హంగర్‌గేకర్, రవి కుమార్, రాజ్ భావ, విక్కీ తలో రెండు వికెట్లు తీశారు. నిశాంత్, కౌశల్ చెరొక వికెట్ పడగొట్టారు. అజేయ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం షేక్ రషీద్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. భారత ఇన్నింగ్స్‌లో ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు షేక్ రషీద్ ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్ యశ్ దుల్‌తో 41, రాజ్ భవ్‌తో 46, విక్కీతో 50 పరుగుల విలువైన భాగస్వామ్యాలు జోడించాడు. ఫైనల్లో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa