ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఈనెల 3న ఛలో విజయవాడ కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను, ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. కొన్నిచోట్ల హౌస్ అరెస్టులు చేస్తుండగా మరికొన్నిచోట్ల ముందస్తు నోటీసులు జారీ చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విజయవాడ వైపు వచ్చే ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఛలో విజయవాడకు అనుమతి ఇవ్వలేని పోలీసులు స్పష్టం చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అనుమతులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తరువాత ఏది జరిగినా దానికి ఉద్యోగ సంఘాలే బాధ్యత వహించాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. గురువారం నాడు అత్యవసరమైతే తప్పా ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. చెప్పకుండా సెలవులు పెట్టిన వారిపైనా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు ప్రభుత్వం ఇలా కఠినంగా ఆంక్షలు పెడుతుంటే, మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa