ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అండర్-19 ప్రపంచకప్ లో ఫైనల్స్‌కు చేరిన భారత జట్టు

national |  Suryaa Desk  | Published : Thu, Feb 03, 2022, 08:28 AM

అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. అంటిగ్వాలోని కూలిడ్జ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం ఎల్లుండి ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న భారత జట్టు మూడో వికెట్‌కు 204 పరుగులు జోడించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. వైస్ కెప్టెన్ షేక్ రషీద్ 108 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 94 పరుగులు చేసి కొంచెంలో సెంచరీ మిస్ చేసుకోగా, కెప్టెన్ యశ్ ధుల్ మరోమారు మోతెక్కించాడు. 110 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 110 పరుగులు చేసి శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరి దెబ్బకు స్కోరు అలుపులేకుండా పరుగు తీసి 290 పరుగుల వద్ద ఆగింది.


అనంతరం 291 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల పదునైన బంతులను ఎదుర్కోవడంలో తబడిన బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. కేంప్‌బెల్ కెల్లావే (30), కోరీ మిల్లర్ (38), లచ్లాన్ షా (51) మినహా మరెవరూ రాణించలేకపోయారు. ఫలితంగా 194 పరుగుల వద్ద ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో విక్కీ ఓస్వాల్ మూడు వికెట్లు తీసుకోగా, రవికుమార్, నిశాంత్ సింధు రెండేసి, కౌశల్ తాంబే, రఘువంశీ చెరో వికెట్ తీసుకున్నారు. సెంచరీతో చెలరేగిన కెప్టెన్ యశ్ ధుల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, భారత జట్టుకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా, ఈ టోర్నీలో మొత్తంగా 8వ గెలుపు కావడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa