తెలంగాణలో పూర్వ వైభవాన్ని సంపాదించడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడమే లక్ష్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ ఉదయం సమావేశమయ్యారు. హైదరాబాద్ లో పలువురు నేతలతో సమావేశమైన ఆయన, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని, ఏ నేతలు వలస వెళ్లినా నష్టం ఉండబోదని, కార్యకర్తల బలం క్షేత్రస్థాయిలో పార్టీకి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ కోసం తాను త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎల్ రమణ, రేవంత్ రెడ్డి, దేవేందర్ గౌడ్, ఆర్ కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు. కాగా, ఇటీవల మోత్కుపల్లి నర్సిహులు మీడియాతో మాట్లాడుతూ, తాము టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమేనని చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపగా, చంద్రబాబు నేతలతో సమావేశమై మంతనాలు జరపడం గమనార్హం. ఈ సమావేశం గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa