బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం(Low pressure) వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఇది పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ.. తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Huge Rains) కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 4 నుంచి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప.. ఇంట్లో నుంచి బయటకు రావద్దని తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రం లోపలకు వేటకు వెళ్లిన వారు వీలైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని సూచించారు. గతేడాది నవంబర్ లో జరిగిన వరద బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
గతేడాది నవంబర్ లో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాయుగుండం కారణంగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు నాలుగు జిల్లాల్లో 24 మంది మృతి చెందారు. భారీ వర్షాలతో చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి ప్రభుత్వం కుటుంబానికి రూ.2వేలు ఆర్థిక సహాయం అందించింది. తిరుపతిలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.4కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. రక్షణ గోడలు దెబ్బతిన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa